పోయినేడాది 78,249, ఈఏడాది 86,142 అడ్మిషన్లు
హైదరాబాద్, వెలుగు: సర్కారు జూనియర్ కాలేజీల్లో జాయిన్ అయిన స్టూడెంట్ల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో ఉన్న 404 సర్కారు కాలేజీల్లో 2020–21 విద్యా సంవత్సరంలో ఫస్టియర్లో 86,142 మంది స్టూడెంట్స్అడ్మిషన్ తీసుకోగా, వీరిలో 19 వేల మంది ఒకేషనల్ కోర్సుల్లో జాయిన్ అయ్యారు. లక్షమందికి పైగా స్టూడెంట్స్ జాయిన్ అయినా, వివిధ కారణాలతో కొందరు డ్రాప్ అయ్యారని ఆఫీసర్లు చెబుతున్నారు. 2019–20 విద్యాసంవత్సరంలో ఫస్టియర్లో 78,249 మంది చేరారు. ఈ లెక్కన పోయిన ఏడాది కంటే 7,893 అడ్మిషన్లు పెరిగాయి.
లాస్టియర్తో పోలిస్తే 25 జిల్లాల్లో ఈసారి ఫస్టియర్ అడ్మిషన్లు పెరగగా, పది జిల్లాల్లో తగ్గాయి. హైదరాబాద్–1, హైదరాబాద్–2, సిద్దిపేట, వరంగల్ అర్బన్, జగిత్యాల, మహబూబ్నగర్తదితర జిల్లాల్లో అడ్మిషన్లు పెరిగాయి. కరోనా నేపథ్యంలో పోయినేడాది టెన్త్ స్టూడెంట్స్అంతా పాస్ కావడంతో, అడ్మిషన్ల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు అనుకున్నారు. అయితే ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు రాలేదంటున్నారు. ఇంటర్ స్టూడెంట్స్కు మిడ్ డే మీల్స్ పెడతామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో చాలామంది కాలేజీల్లో చేరారని, కానీ ప్రభుత్వం ఈ ఏడాది కూడా మిడ్ డే మీల్స్ పెట్టకుండా వారిని మోసం చేసిందని లెక్చరర్లు వాపోతున్నారు.