
- ప్రజాభిప్రాయం మేరకు పునర్వ్యవస్థీకరణ జరగలేదని డిస్కషన్
- వరంగల్లో మూడు జిల్లాల పరిధిలో ఒక్కో నియోజకవర్గం
- ఓరుగల్లు సిటీని ఒకే జిల్లా చేయాలనే వాదన
- నల్గొండలో గజిబిజిగా మండలాల పరిధి
వరంగల్/నల్గొండ, వెలుగు : కొత్త జిల్లాలపై మళ్లీ ఆసక్తికర చర్చ మొదలైంది. 2016 అక్టోబర్11న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కొత్త జిల్లాల ప్రక్రియ అశాస్త్రీయంగా జరిగిందని, ప్రజాభిప్రాయం మేరకు జిల్లాల పునర్వీస్థీకరణ చేపట్టలేదని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. ఇందులో భాగంగా కొత్త జిల్లాల ప్రక్రియను పున:పరిశీలిస్తామని, దీని కోసం ప్రత్యేకంగా కమిటీ వేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ కొత్త జిల్లాల గురించి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల విభజన చేశామని చెప్పిన గత బీఆర్ఎస్ సర్కార్ మండలాల సమస్యను గాలికి వదిలేసింది. భౌగోళిక సరిహద్దుల సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోయింది. దీంతో ప్రజలు, అధికార యంత్రాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ సర్కార్ ముందు మండలాల రేషనలైజేషన్ చేస్తామని చెప్తోంది. దీనివల్ల మండలాలన్నీ ఒకే జిల్లా పరిధిలోకి వస్తాయని, తద్వారా పరిపాలన సౌలభ్యం మరింత మెరుగుపడుతుందని అంటోంది.
33 జిల్లాలుగా పది ఉమ్మడి జిల్లాలు
తెలంగాణ రాష్ట్రం 10 ఉమ్మడి జిల్లాలతో ఏర్పడగా..అప్పటి సీఎం కేసీఆర్ 2016లో పరిపాలన సౌలభ్యం పేరుతో వీటిని 31 జిల్లాలు చేశారు. ఆపై 2019లో నారాయణపేట, ములుగు జిల్లాలను ప్రకటించి మొత్తంగా రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా మార్చారు.
ఉదాహరణకు వరంగల్ను తీసుకుంటే ఈ జిల్లాను ఆరు జిల్లాలుగా విడగొట్టారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలుగా ఏర్పాటు చేశారు. అయితే, ఏ మండలం, ఏ ప్రాంతం..
ఏ జిల్లాలో ఉందో తెలియని విధంగా జిల్లాను విభజించారు. ఒక్కో నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉంది. పాలకుర్తి నియోజకవర్గం చూసుకుంటే పాలకుర్తి కేంద్రం జనగామ జిల్లాలో, తొర్రూర్ మహబూబాబాద్లో, రాయపర్తి వరంగల్ జిల్లాలో ఉంది. ఈ లెక్కన అక్కడి ఎమ్మెల్యే మూడు జిల్లాల పరిధిలో నిర్వహించే మీటింగులకు హాజరుకావాల్సి వస్తోంది. ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా మూడు జిల్లాల అధికారులతో సమావేశం కావాల్సివస్తోంది.
రూరల్, అర్బన్ వద్దని చెప్పినా వినలే
వరంగల్ను విడగొట్టే క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ పేరుతో రెండు జిల్లాలు ఏర్పాటు చేసింది. మండలాలు, గ్రామాలు ఇతరత్రా మార్పులు లేకుండా ఈ పేర్లను హనుమకొండ, వరంగల్గా మార్చాలని పలువురు మేథావులు, కవులు, రచయితలు అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఆయన మాత్రం వరంగల్ను ఆయన అనుకున్నట్టే చేశారు. ఇందులోని మండలాలు అందులోకి..అందులోని మండలాలు ఇందులోకి మార్చి అయోమయంలో పడేశారు. దీంతో ములుగు రోడ్ అవతల ఓ జిల్లా.. ఇవతల మరో జిల్లా అయింది. కార్పొరేటర్ల ఏరియాలు కొన్ని వరంగల్లో, మరికొన్ని హనుమకొండ జిల్లాలోకి వెళ్లాయి. దీంతో డివిజన్లలో ఏదైనా చిన్న సమస్య వస్తే..ఇద్దరు కలెక్టర్ల వద్దకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. పైగా వరంగల్ జిల్లా పాలన మొత్తం హనుమకొండ కేంద్రంగానే సాగు తోంది. వరంగల్ కలెక్టరేట్, కోర్టు, ఆర్డీఓ, అగ్రికల్చర్ ఆఫీసు మొదలు దాదాపు 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాలన్నీ హనుమకొండ జిల్లాలోనే ఉన్నాయి.
సిటీని ఒకే జిల్లా చేసే ఆలోచనలో ఎమ్మెల్యేలు
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి మొదలుకొని లోకల్ ఎమ్మె ల్యేల వరకు వరంగల్ను ఆరు ముక్కలు చేయడాన్ని తప్పుపడుతున్నారు. అదే సమయంలో ప్రజాభీష్టం మేరకు జిల్లాలను కుదించాలంటున్నారు. గత ప్రభుత్వం మాదిరి సొంత నిర్ణయాలను జనాలపై
రుద్దకుండా..ప్రజలకు ఇబ్బందుల్లేకుండా జిల్లాల పరిధి మార్చాలని కోరుతున్నారు. ఇందులో ప్రధానంగా గ్రేటర్ వరంగల్ సిటీని తిరిగి ఒకే జిల్లా చేయాలనే ఆలోచనతో ఇక్కడి ఎమ్మెల్యేలున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, కడియం కావ్య ఇదే విషయమై చాలాసార్లు మాట్లాడారు. దీనిపై కమిషన్ ముందు వాదనలు వినిపిస్తామన్నారు. ఇక.. ములుగు జిల్లా విషయంలో ఎటువంటి మార్పులు ఉండవని అక్కడి ఎమ్మెల్యేగా మంత్రి సీతక్క ప్రకటించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇలా...
ఉమ్మడి నల్గొండ జిల్లాను నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలుగా విభజించారు. మండ లాల సంఖ్యను 59 నుంచి 72కి పెంచారు. కానీ ఆయా మండలాల పరిధి అంతా గజిబిజిగా ఉంది. దీనివల్ల ప్రజలు వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట యాదాద్రి జిల్లాలో ఉండగా, ఇదే నియోజకవర్గంలోని చిట్యాల నల్గొండ జిల్లా పరిధిలో ఉంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలిగౌరారం మండలం నల్గొండ జిల్లా పరిధిలో ఉంది. మునుగోడు నియోజకవర్గం ఇటు నల్గొండ, అటు యాదాద్రి జిల్లాలకు విడిపోయింది. చౌటుప్పుల్, సంస్థాన్ నారాయణ్పూర్ మండలాలు యాదాద్రి జిల్లాలో ఉండగా, కొన్ని మండలాలు నల్గొండ జిల్లాలో ఉన్నాయి. దేవరకొండ నియోజకవర్గంలోని డిండి మండలం అయితే ఏకంగా నల్గొండ జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాలదన్నట్టుగా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అప్పటి బీఆర్ఎస్ప్రభుత్వం కొత్తగా ఇంకొన్ని మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. మునుగోడు ఉప ఎన్నికల్లో చండూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయగా, నకిరేకల్, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో కొత్తగా కొన్ని మండలాలు ఏర్పాటు చేశారు. ఈ మండలాల్లో ఇప్పటి వరకు పరిపాలన పరంగా ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు.
పార్లమెంట్ నియోజకవర్గానికో జిల్లా...
నల్గొండలో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లా ఏర్పాటు చేస్తే బాగుండేదని 2016లో మేథావులు, జిల్లా ప్రజలు అభిప్రాయపడ్డారు. కానీ, రెండేసి నియోజకవర్గాలకు..ఒక నియోజకవర్గ కేంద్రాన్నే జిల్లాగా ఏర్పాటు చేశారు. దీనివల్ల పరిపాలన సౌలభ్యం కంటే అదనపు పని భారం పెరిగిందని అధికారులంటున్నారు. ఐదేండ్లకోసారి వచ్చే ఎన్నికల నిర్వహణ మరింత కష్టంగా మారింది. అంతేగాక అభివృద్ధి పనులపైనే అధికారుల పర్యవేక్షణ కొరవడి విధులకు ఆటంకంగా మారింది.
కొత్త మున్సిపాలిటీలు అధ్వానం...
నల్గొండ జిల్లాలో పది వేల జనాభా దాటిన చిన్నచిన్న మండల కేంద్రాల పరిధిలోకి చిన్న గ్రామాలను విలీనం చేసి 2019లో కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు. దీనివల్ల కలిగిన ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉందని ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం రద్దయ్యింది. ఇంటిపన్నుల భారం పెరిగింది. మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాలు అలాగే ఉన్నాయి. చిట్యాల, చండూరు, నందికొండ, భూదాన పోచంపల్లి, మోత్కూరు వంటి మున్సిపాలిటీల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. మండలాలతోపాటు, కొత్త మున్సిపాలిటీల విషయంలో కూడా ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలని కోరుతున్నారు.