భారత్ ఇథనాల్ తయారీలో దూసుకుపోతోంది. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా నిలిచింది. పెట్రోలులో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని నిర్ణయించిన గడువుకంటే 5 ఏళ్ల ముందే సాధించింది. దీంతో క్రూడ్ దిగుమతులపై ఆధారపడటం కొంత తగ్గడంతో పాటు చెరకు, వరి, మొక్కజొన్న వంటి పంటలకు కొత్త మార్కెట్ ఏర్పడింది. 2014 నుంచి ఇథనాల్ వల్ల చక్కెర మిల్లులకు రూ.లక్షా 29వేల కోట్లకు పైగా ఆదాయం, రైతులకు రూ.లక్షా 60వేల కోట్లకు పైగా అదనపు ఆదాయం వచ్చినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కానీ E20 తర్వాత అసలు సవాలు మొదలైంది.
ఉత్పత్తి సామర్థ్యం 3 రెట్లు పెంపు
దేశంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం గత దశాబ్దంలో దాదాపు 3 రెట్లు పెరిగింది. సుమారు 680 కోట్ల లీటర్ల నుంచి దాదాపు 2వేల కోట్ల లీటర్లకు చేరుకుంది. దీంతో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఇథనాల్ ఉత్పత్తిదారుగా నిలిచింది. అయితే ఇదే సమయంలో కంపెనీలకు కొత్త సమస్యలు మెుదలయ్యాయి. భారీగా సామర్థ్యాన్ని పెంచుకున్నప్పటికీ.. కొన్ని ప్లాంట్లు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. తగిన డిమాండ్ లేకపోవడంతో పెంచుకున్నఉత్పత్తి సామర్థ్యం ఖాళీగా ఉంచుకుంటున్నాయి ఇథనాల్ తయారీ కంపెనీలు.
E25, E85పై కంపెనీల ఫోకస్
ఇక ముందుకు E25, ఆ తర్వాత E85 వైపు వెళ్లేందుకు ఇథనాల్ ఇండస్ట్రీ సిద్ధమవుతోంది. E85 వినియోగానికి అవసరమైన ఫ్యూయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా ప్రభుత్వం పెంచుతోంది. ప్రస్తుతం 48 కేంద్రాల్లో E85 అందుబాటులో ఉండగా.. 2026 డిసెంబర్ నాటికి 500, 2027 డిసెంబర్ నాటికి సుమారు 5వేల కేంద్రాలకు పెంచే ప్రణాళిక ఉంది. ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల సంఖ్య పెరగడం ఈ మార్కెట్కు కీలకం. అయితే వినియోగదారులకు ఆకర్షణీయమైన ధరలు, స్పష్టమైన ఆర్థిక ప్రోత్సాహకాలు లేకపోతే అధిక బ్లెండింగ్కు డిమాండ్ రావడం ఊహించిన స్థాయిలో ఉండకపోవచ్చు.
పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు
ఇథనాల్ కంపెనీలకు మరో పెద్ద ఇబ్బంది తయారీ ఖర్చులు. మొత్తం ఖర్చులో ఫీడ్స్టాక్ వాటా దాదాపు 80 శాతం ఉంటోంది. చెరకు, మొక్కజొన్న వంటి ముడి పదార్థాల ధరలు పెరగడం, వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండటం కంపెనీలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోతే ఒక్కో లీటర్ ఇథనాల్ ఉత్పత్తిపై ఖర్చు మరింత పెరుగుతుంది. అందుకే పరిశ్రమ వర్గాలు ధరలను క్రమంగా పెంచాల్సిన అవసరం ఉందని చెబుతున్నాయి. ప్రస్తుతం ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో మరింత స్థిరమైన ధరల విధానం కావాలన్న డిమాండ్ ఉంది.
పెట్రోల్ దాటి కొత్త మార్కెట్ల కోసం వేట
ఇథనాల్ కంపెనీలు కేవలం పెట్రోల్ బ్లెండింగ్పైనే ఆధారపడకుండా కొత్త మార్కెట్లను వెతుకుతున్నాయి. కెమికల్స్, సాల్వెంట్స్, ఫార్మాస్యూటికల్స్, శానిటైజర్లు వంటి రంగాల్లో ఇప్పటికే వాడుతున్నారు. ఇక సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్లో ఇథనాల్ను ఉపయోగించడం అతిపెద్ద అవకాశాల్లో ఒకటిగా పరిశ్రమ చూస్తోంది. మెరైన్ ఫ్యూయల్, ప్రత్యేక స్టవ్ల ద్వారా వంట ఇంధనంగా వినియోగం వంటి అవకాశాలపై కూడా పరిశీలన జరుగుతోంది. అయితే వీటి వాణిజ్య సాధ్యత ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు.
భవిష్యత్లో అసలు సవాలు ఇదే
ఇథనాల్ రంగం ముందుకు వెళ్లాలంటే ఉత్పత్తి సామర్థ్యం పెంచడం ఒక్కటే సరిపోదు. అధిక బ్లెండింగ్కు అనుగుణంగా ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు, ప్రత్యేక ఫ్యూయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్థిరమైన ఫీడ్స్టాక్ పాలసీ, వినియోగదారులకు అందుబాటు ధరలు అవసరం. మరోవైపు E20 వల్ల మైలేజ్ తగ్గుతుందన్న వాహనదారుల ఆందోళనను కూడా తగ్గించాలి. ఆహార భద్రత, నీటి వినియోగం, కాలుష్యం వంటి సమస్యలు కూడా ఇథనాల్ విస్తరణకు సవాళ్లుగా ఉన్నాయి. కాబట్టి వచ్చే 5 ఏళ్లలో కంపెనీల లక్ష్యం కేవలం మరింత ఇథనాల్ ఉత్పత్తి చేయడం కాకుండా, దానికి కొత్త డిమాండ్ సృష్టించడం, ఖర్చులను నియంత్రించడం, విభిన్న రంగాల్లో మార్కెట్లను అభివృద్ధి చేయడం కానుంది.
మెుత్తానికి విదేశాల నుంచి క్రూడ్ బిల్లును తగ్గించుకుందాం అని ఇథనాల్ కలపటం స్టార్ట్ చేస్తే.. ఇప్పుడు కంపెనీలు ఇథనాల్ రేట్లను పెంచమని ప్రభుత్వాన్ని కోరటం వింత పరిస్థితికి దారితీసింది. దీన్ని చూస్తుంటో భవిష్యత్తులో ప్యూర్ పెట్రోల్ కంటే ఇథనాల్ కలిపిన పెట్రోల్ ఖరీదైనదిగా మారొచ్చని నిపుణులు అంటున్నారు. ఖరీదు ఎక్కువ అవుతున్నప్పుడు ప్యూర్ పెట్రోల్ బెటర్ కథా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జనం కూడా నెమ్మదిగా ఎలక్ట్రిక్, సీఎంజీ వంటి ఇతర ప్రత్యామ్నాయాలకు మారటం కూడా ఇథనాల్ డిమాండ్ ప్రభావితం చేయెుచ్చని అంచనాలు చెబుతున్నాయి.
