భారత స్వాతంత్ర్య దినోత్సవం.. ఆగస్టు 15పై అమెరికా కీలక ప్రకటన

భారత స్వాతంత్ర్య దినోత్సవం.. ఆగస్టు 15పై అమెరికా కీలక ప్రకటన

భారత స్వాతంత్ర్య దినోత్సవంపై అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాలు కీలక ప్రకటన చేశాయి. ఆగస్టు 15ను భారత స్వాతంత్య్ర దినోత్సవంగా ప్రకటించాయి. భారత స్వాతంత్య్ర ప్రయాణం, ఇండో-అమెరికన్ సమాజం సేవలను గుర్తిస్తూ ఈ ప్రకటనలు చేయడం ప్రవాస భారతీయులు అరుదైన గౌరవంగా భావిస్తున్నారు. 

న్యూయార్క్ గవర్నర్ కాథీ హోకుల్ రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 15, 2026ను ఇండియా ఇండిపెండెన్స్ డేగా ప్రకటించారు. న్యూజెర్సీ గవర్నర్ మైకీ షెర్రిల్ కూడా ఇదే ప్రకటన చేశారు. భారత కాన్సులేట్ న్యూయార్క్ ఈ వివరాలను ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ముందు ఈ ప్రకటనలు రావడం కీలక పరిణామం. ఇండియా, అమెరికా పంచుకునే ప్రజాస్వామ్య విలువలను ఇవి హైలైట్ చేస్తున్నాయని కాన్సులేట్ తెలిపింది.

న్యూయార్క్, న్యూజెర్సీ రెండూ పక్కపక్కన ఉన్న రాష్ట్రాలు. అమెరికాలో అత్యధిక ఇండో అమెరికన్స్ నివసిస్తున్న రాష్ట్రాలు అవి. వ్యాపారం, ఆరోగ్య సంరక్షణ, టెక్నాలజీ, విద్య, ప్రజా సేవ రంగాల్లో మనవాళ్లు గణనీయమైన సేవలు అందిస్తున్నారు.

న్యూయార్క్ ప్రకటనలో ఇండో-అమెరికన్ సమాజం సాంస్కృతిక, ఆర్థిక, పౌర జీవితానికి చేసిన సహకారానికి గుర్తింపు లభించినట్లయింది.  భారత వలస పాలన నుంచి విముక్తి పోరాటం, స్వయం నిర్ణయాధికారం, ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండటాన్ని కూడా ఈ ప్రకటనలో ప్రస్తావించారు.

భారత కాన్సులేట్ ఈ ప్రకటనలపై గవర్నర్లకు కృతజ్ఞతలు తెలిపింది. ఇండియా-అమెరికా మధ్య స్నేహం, భారతీయ అమెరికన్ల సేవలను గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపింది.

ఇంతకు ముందు మసాచుసెట్స్ గవర్నర్ మౌరా హీలీ, బోస్టన్ మేయర్ మిషెల్ వు కూడా ఆగస్టు 15ను ఇండియా డేగా ప్రకటించారు. అమెరికాలో సుమారు 54 లక్షల మంది భారత మూలాలు ఉన్న వారు నివసిస్తుండటం గమనార్హం.