ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. బుధవారం ( ఆగస్టు 13 ) రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మదనపల్లెలోని పీ అండ్ టీ కాలనీలో భారీ దొంగతనం జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లోకి కిటికీ గ్రిల్ కట్ చేసి చొరబడ్డారు దొంగలు. ఇంట్లో ఉన్న 400 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి ఎత్తుకెళ్లారు దొంగల ముఠా.
ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ముసుగులు, చెడ్డీలు ధరించిన నలుగురు చెడ్డీ గ్యాంగ్ వీధుల్లో తిరుగుతున్నట్లు రికార్డ్ అయ్యింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల దొంగల కోసం గాలిస్తున్నారు పోలీసులు.
కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని... కొత్త వ్యక్తులు ఇంటికి వస్తే.. గుడ్డిగా నమ్మి ఇంట్లోకి రానివ్వద్దని సూచిస్తున్నారు పోలీసులు. ఎవరైనా ఇంటికి తాళం వేసి వేరే ఊళ్లకు వెళ్లే క్రమంలో పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు పోలీసులు.
