IND vs BAN Series in Trouble: భారతదేశంతో ఆగిపోయిన క్రికెట్ సిరీస్ను (3 వన్డేలు, 3 టీ20లు) మళ్లీ మొదలు పెట్టాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు గట్టిగానే ప్రయత్నిస్తోంది. గతంలో ఇరు దేశాల మధ్య వచ్చిన కొన్ని గొడవలు, భద్రతా సమస్యల వల్ల ఈ మ్యాచ్లు ఆగిపోయాయి. బంగ్లాదేశ్లో కొత్తగా వచ్చిన ప్రధాన మంత్రి తారిక్ రెహ్మాన్ ప్రభుత్వం భారత్తో మళ్లీ మంచి సంబంధాలు పెంచుకోవాలని ఎదురు చూస్తోంది.
విదేశాంగ మంత్రుల స్థాయిలో చర్చలు:
ఆటల ద్వారా భారత్తో ఉన్న సమస్యలను తొలగించుకోవాలని బంగ్లాదేశ్ చూస్తోంది. ఈ వ్యవహారంపై బంగ్లాదేశ్ క్రీడా మంత్రి అమినుల్ హక్ మాట్లాడుతూ.. ప్రధాని తారిక్ రెహ్మాన్ ఇప్పటికే భారత హైకమిషన్తో చర్చలు జరిపారని వెల్లడించారు. ప్రపంచకప్ చుట్టూ ఏర్పడిన డెడ్లాక్ను త్వరగా పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం.. క్రీడల ద్వారా పొరుగుదేశమైన భారత్తో మళ్లీ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడమే తమ ప్రధాన మా లక్ష్యం అన్నారు. విదేశాంగ మంత్రుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి, త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
బంగ్లా పర్యటనకు భారత్ నాట్ ఇంట్రెస్ట్:
బంగ్లాదేశ్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ, ఆగస్టు చివరి నుంచి సెప్టెంబర్ మధ్యలో ఈ సిరీస్ జరగడం కష్టమేనని తెలుస్తోంది. ఎందుకంటే, ఇదే సమయంలో (సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్థాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు బీసీసీఐ ఇప్పటికే అంగీకారం తెలిపింది. ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు (ACB) కూడా ఈ తేదీలను అధికారికంగా ఖరారు చేస్తూ వ్యాపార భాగస్వాములకు లేఖ రాసింది. దీంతో భారత్ బంగ్లాదేశ్ పర్యటన మరోసారి వాయిదా పడే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి.
