విదేశీ విరాళాల నియంత్రణకు సంబంధించిన FCRA సవరణ బిల్లు-2026పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ బిల్లును సమగ్రంగా పరిశీలించేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) కి పంపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 12న పార్లమెంటులో ఈ బిల్లుపై చర్చ జరగనుంది.
ఇప్పటికే ఈ బిల్లుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా విదేశీ నిధులతో పనిచేసే స్వచ్ఛంద సంస్థలు, చర్చి సంస్థలకు సంబంధించిన అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ప్రజలకోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, పౌరసమాజంపై ఒత్తిడి తెచ్చేందుకు FCRA ను ఉపయోగించుకునేందుకు ఈ సవరణ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు.
ఈ బిల్లు ప్రకారం.. FCRA రిజిస్ట్రేషన్ రద్దు అయినా, గడువు ముగిసినా, రెన్యువల్ చేసుకోకపోయినాఆ సంస్థకు వచ్చిన విదేశీ నిధులతో కొనుగోలు చేసిన ఆస్తులను నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
►ALSO READ | బెంగళూరు వెళ్తున్నారా.. ఏది పడితే అది తినొద్దు.. కల్తీ ఫుడ్ తో నిండిపోయిన హోటల్స్
అయితే ప్రార్థనా స్థలాలకు సంబంధించిన ఆస్తుల విషయంలో వాటి మతపరమైన స్వభావాన్ని కాపాడాలని బిల్లులో ప్రతిపాదించారు. మరోవైపు FCRA నిబంధనల ఉల్లంఘనకు గరిష్ఠ జైలు శిక్షను ఐదేళ్ల నుంచి ఒక సంవత్సరానికి తగ్గించే ప్రతిపాదన కూడా ఉంది.
FCRA పోర్టల్ ప్రకారం జూలై 15, 2026 నాటికి దేశంలో 14వేల449 క్రియాశీల FCRA సర్టిఫికెట్లు ఉండగా, 22వేల498 రద్దయ్యాయి. మరో 15వేల212 సర్టిఫికెట్లు గడువు ముగిసినవిగా ఉన్నాయి. బిల్లును JPC పరిశీలిస్తే.. ప్రతిపాదిత మార్పులపై మరింత విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
