శానిటైజర్ ఇవ్వని డిపో మేనేజర్ సస్పెండ్

శానిటైజర్ ఇవ్వని డిపో మేనేజర్ సస్పెండ్

ఖమ్మం బస్ స్టాండ్ లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆకస్మికంగా పర్యటించారు.ఇందులో భాగంగా బస్సుల వివరాలు, ప్రయాణీకులకు అందిస్తున్న సౌకర్యాలకు సంబంధించిన వివరాలను RM ను  అడిగి తెలుసుకున్నారు. ప్రతి డిపోలో కండక్టర్ కు తప్పని సరిగా హ్యాండ్ శానిటైజర్ ఇవ్వాలని, బస్సులో ప్రయాణికులకు హ్యాండ్ శానిటైజ్ చేసిన తర్వాతనే టికెట్ ఇవ్వాలని అన్నారు. మాస్క్ లేకుంటే టికెట్ ఇవ్వవద్దని ఆదేశించారు. ఆ తర్వాత పువ్వాడ కోదాడ డిపో బస్సు ఎక్కారు. శానిటైజర్ ఏదంటూ కండక్టర్ ను అడిగారు. ఇవ్వలేదని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి… సూర్యాపేట జిల్లా RM తో ఫోన్లో మాట్లాడారు. కండక్టర్ కు శానిటైజర్ ఇవ్వని కోదాడ డిపో మేనేజర్ ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలోభాగంగా  రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలోని అన్ని బస్సులకు విధిగా శానిటైజర్ అందించాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రయాణికులకు స్వయంగా శానిటైజర్ స్ప్రే చేశారు మంత్రి పువ్వాడ.