- ఇకపై శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోవద్దు
- కేఆర్ఎంబీ సమావేశంలో తేల్చి చెప్పిన రాష్ట్రం
హైదరాబాద్, వెలుగు: చెన్నై నగరానికి తాగు నీటి కోసం శ్రీశైలం ప్రాజెక్టుపై ప్రత్యేక లిఫ్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ తేల్చి చెప్పింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తీసుకుంటున్నందున, చెన్నైకి తాగు నీటి పేరుతో ఏపీ ప్రతిపాదించిన లిఫ్ట్ అవసరం లేదని తెలిపింది. గురువారం జలసౌధ నుంచి చెన్నైకి తాగు నీటి విడుదలపై కేఆర్ఎంబీ కమిటీ ఆరో సమావేశం వెబినార్ ద్వారా నిర్వహించింది. బోర్డు మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్పురే అధ్యక్షతన నిర్వహించిన ఈ వెబినార్లో తమిళనాడు ఈఎన్సీ, ఏపీ నుంచి తెలుగు గంగ, కర్నూల్ సీఈలు హరినారాయణ్ రెడ్డి, మురళీనాథ్ రెడ్డి, తెలంగాణ నుంచి ఇంటర్ స్టేట్ సీఈ మోహన్ కుమార్, ఎస్ఈ కోటేశ్వర్ రావు పాల్గొన్నారు. చెన్నై తాగునీటి కోసమే ఎత్తిపోతల పథకం చేపట్టాలని, శ్రీశైలం నుంచి పూండి రిజర్వాయర్కు పైపులైన్ ద్వారా తరలించాలని ఏపీ ప్రతిపాదించింది. దీనిని తెలంగాణ వ్యతిరేకించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా గత మూడేండ్లుగా కోటాకు మించి మూడు, నాలుగు రెట్లు నీటిని అదనంగా తరలించుకుపోతున్నారని, అలాంటప్పుడు కొత్తగా ఎత్తిపోతల అవసరం లేదని తోసిపుచ్చింది.
ఇంకో ఐదు టీఎంసీలు చెన్నైకు ఇవ్వండి
జులై నుంచి అక్టోబర్లలో 8 టీఎంసీల నీటిని చెన్నై తాగు నీటి కోసం విడుదల చేశారని, ఇందులో 6 టీఎంసీలు పూండి రిజర్వాయర్కు చేరుకున్నాయని, మిగతా నీటిని త్వరగా విడుదల చేయాలని తమిళనాడు ఈఎన్సీ విజ్ఞప్తి చేశారు. ఫ్లడ్ డేస్లో పోతిరెడ్డిపాడు నుంచి పెద్ద ఎత్తున నీటిని కండలేరు జలాశయానికి తరలించుకుపోయారని, చెన్నైకి ఇంకా ఇవ్వాల్సిన మిగతా నీటిని అక్కడి నుంచే తరలించాలని తెలంగాణ ఇంటర్ స్టేట్ సీఈ సూచించారు. చెన్నైకి సరఫరా చేసే నీటిని తమ రిజర్వాయర్లలో నిల్వ చేయలేమని, అందుకే శ్రీశైలం నుంచి లిఫ్టు ద్వారా తరలించేందుకు అనుమతివ్వాలని ఏపీ కోరింది. కండలేరు నుంచి పూండి రిజర్వాయర్ వరకు పైపులైన్ ఏర్పాటుపై డీపీఆర్ తయారు చేసి ఇస్తే పరిశీలిస్తామని తెలంగాణ సీఈ తెలిపారు. తర్వాత చెన్నై తాగు నీటి కోసం ఇంకో 5 టీఎంసీలను విడుదల చేయాలని కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ ఏపీ అధికారులను ఆదేశించారు.
ఆర్డీఎస్పైనా కమిటీ వేయాలె
చెన్నై తాగు నీటి సరఫరాపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్టుగానే ఆర్డీఎస్ నుంచి తెలంగాణకు రావాల్సిన నీటిపైనా కమిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని కమిటీ మీటింగ్ మినిట్స్లో చేర్చాలని కోరింది. దీనిపై కేఆర్ఎంబీ సముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.