హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని నాంపల్లి నియోజకవర్గంలో బోగస్ ఓట్లు ఉన్నాయని, వాటిపై విచారణ చేసి వెంటనే తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ను కాంగ్రెస్ నేతలు కోరారు. బుధవారం పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు, నాంపల్లి ఇన్చార్జ్ ఫిరోజ్ఖాన్, పార్టీ ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి తదితరులు సీఈవోకు కంప్లైంట్ చేశారు. ఈ సెగ్మెంట్లో దాదాపు లక్ష బోగస్ ఓట్లు ఉన్నాయని ఫిరోజ్ ఖాన్ ఆరోపించారు. ఇండ్లు లేకపోయినా ఓట్లు ఉన్నాయని అన్నారు. చనిపోయినోళ్ల పేర్లూ లిస్ట్ లోఉన్నాయన్నారు. ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీల ఒత్తిడితోనే ఆఓట్లను తొలగించడం లేదని విమర్శించారు. ఎంఐఎం పార్టీ ఆ బోగస్ ఓట్లతోనే గెలుస్తున్నదని ఆయన మండిపడ్డారు.
పాతబస్తీలో తప్ప ముస్లింలు ఎక్కువగా ఉన్న మిగతా ప్రాంతాల్లో ఎంఐఎం ఎందుకు గెలవడం లేదని ప్రశ్నించారు. అలాగే, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలోనూ 6 లక్షల నుంచి 7 లక్షల బోగస్ ఓట్లున్నాయని ఆయన ఆరోపించారు. అవే లేకపోతే అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ గెలవరని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లోనూ దొంగ ఓట్లపై కాంగ్రెస్ శ్రేణులు దృష్టి పెట్టాలని రోహిన్ రెడ్డి కోరారు. నాంపల్లి సెగ్మెంట్లో 273 పోలింగ్ బూత్స్, ఉంటే కేవలం 130 మంది బీఎల్వోలే ఉన్నారన్నారు.