- ఖమ్మంలో కరోనాపై మంత్రి ఈటెల రాజేందర్ రివ్యూ
ఖమ్మం: వైద్యరంగంలో కేరళ, తమిళనాడు తర్వాతి స్థానంలో తెలంగాణ రాష్ట్రం టాప్ అని హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ అన్నారు. ఖమ్మంలో శుక్రవారం కరోనాపై మంత్రి రివ్యూ నిర్వహించారు. కరోనా కష్టకాలంలో సేవ చేస్తున్న వైద్యులకు మంత్రి అభినందనలు చెప్పారు. శానిటేషన్ వర్కర్ల పని అభినందనీయం అని అన్నారు. ఖమ్మంలో ప్రభుత్వ డాక్టర్లు గొప్పగా పనిచేస్తున్నారని ఆయన పొగిడారు. సీఎం తెచ్చిన కాన్సెప్ట్ వల్ల ఇన్స్టిట్యూషన్ డెలివరీలు పెరిగాయని మంత్రి అన్నారు. వాటిలో దాదాపు 50 శాతం పైన డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్స్లో జరుగుతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రంలోనే డెలివరీస్ నిర్వహించిన హాస్పిటల్లో ఎమ్సీహెచ్ నంబర్ 1 అని, అవార్డులు కూడా వచ్చాయని అన్నారు. కమిట్మెంట్ ఉంటేనే అలాంటివి సాధ్యం అవుతాయని కొనియాడారు. కరోనా అందర్నీ పట్టిపీడిస్తుందని, గతంలో కూడా ఇలాంటి వైరస్లు అనేకం వచ్చాయని మంత్రి అన్నారు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నందున ప్రపంచలోని ఏ మూల ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తోందని, వూహాన్ నగరంలో చేసిన ఏర్పాట్లను చూసి ప్రజలంతా ఇది భయంకరమైన వైరస్ అని వణికిపోయారని మంత్రి చెప్పారు. అమెరికానే విలవిలాడిపోయిందని, మన దేశంలో వస్తే ప్రమాదకరమని అందరకూ భయపడ్డారని, కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదని మంత్రి అభిప్రాయపడ్డారు. మనకు ఉన్న ఇమ్యూనిటీ పవర్ వల్ల మనం దీన్ని తట్టుకోగలిగామని చెప్పారు. టీబీ, మలేరియాను కూడా ఎదుర్కున్నామని దీన్ని కూడా ఎదుర్కోగలమని ధైర్యం చెప్పారు. మొదట్లో దీన్ని ఇంపోర్ట్ వైరస్ అనుకున్నామని, కానీ ఇప్పుడు ఇక్కడే వ్యాపిస్తోంది. ప్రజల్లో ధైర్యం నింపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని, దాని కోసం కృషి చేస్తున్నామని ఈటెల అన్నారు. ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందిస్తామని, ఎన్ని కోట్లు ఖర్చైన ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రీట్మెంట్ అందించాలని కేసీఆర్ చెప్పారని అన్నారు. ప్రతి 50 ఏండ్లకు , 100 ఏండ్లకు ఏదో ఒక భయంకరమైన వైరస్ మనిషిని భయపెట్టిస్తుందని చరిత్ర చెప్తోందని, గతంలో వచ్చిన వైరస్ల వల్ల అనేక మంది చనిపోయారని గుర్తు చేశారు “ సార్స్, ఎబోలా లాంటి వైరస్లను ఎదుర్కున్నాం. దీనిపై రిసెర్చ్ జరుగుతోంది. ఈ వైరస్కు మనిషిని చంపగలిగే శక్తి లేదు. నిర్లక్ష్యంగా ఉంటే కచ్చితంగా చనిపోతాం. నూటికి 80 శాతం మందికి వైరస్ తెలియకుండనే క్యూర్ అయిపోతుంది. కొంత మందికి హోం ఐసోలేషన్లో క్యూర్ అవుతోంది. 14 శాతం మందికి డాక్టర్ల ట్రీట్మెంట్తో నయం అయ్యే అవకాశం కనిపిస్తోంది. జ్వరం వచ్చినా ఏమైతదిలే అని నిర్లక్ష్యంగా ఉన్నవారు ఇబ్బందికి గురయ్యారు. కేవలం 5శాతం మందికి మాత్రమే సీరియస్గా ఉంది” అని మంత్రి అన్నారు. ఈ వైరస్ వస్తది అంట పోతది అంట అనే భావన ప్రజల్లోకి వచ్చిందని, కానీ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతి ఇల్లు హోమియోపతి దవఖాన అయిందని, ప్రజలంతా ఎక్కడికి అక్కడ వైరస్ను నివారించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. హోం ఐసోలేషన్ సదుపాయాలు లేని వారికి ప్రభుత్వం తరఫున ఐసోలేషన్ ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు. డాక్టర్లు పేషంట్లను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని అన్నారు. ఎన్ని కేసులు వచ్చినా తట్టుకోగల శక్తి, సత్తా తెలంగాణకు ఉందని అన్నారు. “ పేదవాళ్లు భయంతో వణికిపోయి ప్రైవేటు హాస్పిటల్కు పోయి లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. మనిషిని బతికించడానికి ఏ మందు అవసరం ఉన్న వాడండి అని డాక్టర్స్ను విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడా మందులకు కొరత లేదు. ఆక్సిజన్ కొరత, పీపీఈ కిట్లు, మాస్కులు వేటికీ కొరత లేదు. మీకు ఏది అవసరం ఉన్నా దాన్ని వాడండి. ఎక్కడా రాజీ పడం’’ అని మంత్రి చెప్పారు.