- బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ అనడంతో ప్రజలు మోసపోయిన్రు
- 17 లోపు అన్ని హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ను వదలం
- మాజీమంత్రి కేటీఆర్
వీర్నపల్లి/ఎల్లారెడ్డిపేట, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు, ఇందులో అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, 21 పంపింగ్ స్టేషన్లు, 1,770 కిలోమీటర్ల కాల్వలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ చెప్పారు. 1.6 కిలోమీటర్ల ప్రాజెక్ట్లో రెండు పిల్లర్లు మాత్రమే దెబ్బతిన్నాయని, వాటికి రిపేర్లు చేసి నీటిని విడుదల చేయాలని కోరారు. తాము అధికారంలో ఉంటే క్షణాల్లోనే రిపేర్ చేసేవాళ్లమని చెప్పారు. శనివారం వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేటలో ఆయన మాట్లాడారు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ అని చెప్పిన హస్తం పార్టీ మాటలు నమ్మి ప్రజలు మోసపోయారన్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. మార్చి 17తో వంద రోజుల గడువు ముగుస్తుందని, అప్పటివరకు అన్ని హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ను వదిలిపెట్టేదే లేదన్నారు. కాంగ్రెస్ హామీలపై మూడు పుస్తకాలను ప్రింట్ చేసి ప్రతి కార్యకర్తకు ఇస్తామని, వాటిపై ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. ఎంపీ బండి సంజయ్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. అభివృద్ధిని పట్టించుకోకుండా, దేవుడి పేరు చెబుతూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. కరీంనగర్ ఎంపీగా వినోద్కుమార్ విజయం కోసం కార్యకర్తలు పనిచేయాలని సూచించారు.