వెలుగు బిజినెస్ డెస్క్ : బ్యాంకింగ్ సిస్టమ్ పటిష్టంగా ఉందని అటు ఢిల్లీలో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, ఫైనాన్స్ సెక్రటరీ టీ వీ సోమనాథన్ చెప్పగా, ఇటు ముంబైలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్టేట్మెంట్ రిలీజ్చేసింది. అదానీ గ్రూప్కు ఇచ్చిన అప్పులు పరిమితులకు లోపే ఉన్నాయని బ్యాంకులు, ఎల్ఐసీ వివరణ ఇచ్చినట్లు ఫైనాన్స్ మినిస్టర్ పేర్కొన్నారు. ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ పటిష్టంగా ఉందని గ్లోబల్ ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పడినా, పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ల పెట్టుబడులు ఇంకా లాభాల్లోనే ఉన్నట్లు వెల్లడించారు. అదానీ గ్రూప్షేర్లు భారీగా పడుతున్న నేపథ్యంలో ఆ గ్రూప్ కంపెనీలకు బ్యాంకులు ఇచ్చిన అప్పుల విషయంలో కొంత ఆందోళన వ్యక్తమవుతుండటంతో ఈ రెండు స్టేట్మెంట్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యూఎస్ షార్ట్ సెల్లర్ హిండన్బర్గ్ రిపోర్టు వచ్చాక గడచిన వారం రోజుల్లో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. మాక్రో ఎకనమిక్ కోణంలో చూస్తే అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడం టీ కప్పులో తుపాను లాంటిదని ఫైనాన్స్ సెక్రటరీ పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్లలో షేర్ల హెచ్చు–తగ్గులతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని, ఏవైనా పొరపాట్లు జరిగితే యాక్షన్ తీసుకోవడానికి ఇండిపెండెంట్ రెగ్యులేటర్లు ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని బ్యాంకులలో డబ్బు దాచుకున్న డిపాజిటర్లు, ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్లు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోమనాథన్ చెప్పారు.
అదానీ రికార్డులపై ఎంసీఏ రివ్యూ
అదానీ గ్రూప్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లపై మినిస్ట్రీ ఆఫ్ కార్పోరేట్ ఎఫైర్స్ (ఎంసీఏ) రివ్యూ మొదలైనట్లు ఇద్దరు సీనియర్ ఆఫీసర్లు వెల్లడించారు. ఈ గ్రూప్పై ఇలాంటి రివ్యూ జరగడం
ఇదే మొదటిసారి.
గ్లోబల్ రేటింగ్ ఏజన్సీల కామెంట్....
గ్లోబల్ రేటింగ్ ఏజన్సీలు మూడీస్, ఫిచ్ అదానీ గ్రూప్ ఎపిసోడ్పై కామెంట్ చేశాయి. తాజాగా క్యాపిటల్ సమీకరించాలంటే అదానీ గ్రూప్కు కష్టమవుతుందని మూడీస్ చెబితే, ఇప్పటికిప్పుడు రేటింగ్లో మార్పు చేయాల్సిన అవసరమేమీ లేదని ఫిచ్ ప్రకటించింది.
హిండన్బర్గ్పై దర్యాప్తు కోరుతూ సుప్రీం కోర్టులో పిల్.....
క్రవారం ఇంకో ఆసక్తికర పరిణామం కూడా చోటు చేసుకుంది. సీరియల్గా పిటిషన్లు ఫైల్ చేసే అడ్వకేట్ ఎం ఎల్ శర్మ యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్పై దర్యాప్తు కోరుతూ ఒక పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్)ను సుప్రీం కోర్టులో ఫైల్ చేశారు. తన రిపోర్టు ద్వారా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పతనమయ్యేలా చేయడంతోపాటు, ఆ షేర్లలో పెట్టుబడులు పెట్టిన స్మాల్ ఇన్వెస్టర్లు నష్టపోయేలా చేసినందుకు హిండన్బర్గ్ కంపెనీపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలివ్వమని కోర్టును ఆయన కోరారు. ఆ రిపోర్టు వల్ల అదానీ గ్రూప్లోని లిస్టెడ్ కంపెనీలు రూ. 10 లక్షల కోట్ల మేర మార్కెట్ విలువను పోగొట్టుకున్నాయని శర్మ ప్రస్తావించారు.