న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దెబ్బకు లాక్డౌన్ ప్రకటించిన దేశాల జాబితాలో సింగపూర్ కూడా చేరింది. వచ్చే మంగళవారం నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ చేస్తున్నట్టు ఆ దేశ ప్రధాని లీ హసీన్ లూంగ్ ప్రకటించారు. ఎమర్జెన్సీ సర్వీసులు, ముఖ్యమైన ఆర్థిక రంగాలు తప్ప అన్ని ఆఫీసులను మూసేస్తామన్నారు. పరిస్థితులు మారుతున్నందున కఠిన చర్యలు తీసుకోక తప్పడం లేదని చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు సిద్ధమన్నారు. ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్, మార్కెట్లు, సూపర్మార్కెట్లు, క్లినిక్స్, హాస్పిటల్స్, ట్రాన్స్పోర్ట్, బ్యాంకిగ్ సర్వీసులే తెరిచే ఉంటాయని వివరించారు. జనాభా 56 లక్షలున్న సింగపూర్ దేశంలో ఇప్పటివరకు కరోనా కేసులు వెయ్యి దాటాయి. ఐదుగురు చనిపోయారు.
శ్మశానంగా మారుతున్న ప్రపంచ మార్కెట్
ఫ్రాన్స్లో ఉన్న ప్రపంచంలోని అతి పెద్ద హోల్సేల్ ఫుడ్ మార్కెట్లోని కొద్ది భాగాన్ని తాత్కాలిక శ్మశానంగా మార్చనున్నట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. కరోనా మరణాలు ఇప్పటికే ఐదున్నర వేలు దాటడంతో ఈ నిర్ణయం తీసుకున్నామంది. కరోనాతో మృతి చెందిన వారి శవాలను పారిస్ బయటున్న ఈ మార్కెట్లో సేఫ్గా భద్రపరచనున్నట్టు పేర్కొంది. నిర్మాణం పూర్తయ్యాక ఫ్యామిలీ మెంబర్లు నివాళులర్పించడానికి రెండు రూమ్లు ఏర్పాటు చేస్తామని, ఒక్కోసారికి 20 మందినే అనుమతిస్తామంది. మరోవైపు ఫ్రాన్స్లో లాక్డౌన్ను ఏప్రిల్ 15 తర్వాత పొడిగించనున్నట్టు తెలిసింది.
లాక్డౌన్ ఎత్తేసిన్రు.. బయటకు రావొద్దంటున్రు
కరోనా పుట్టిన చైనాలోని వుహాన్ కాస్త కుదుటపడినా వైరస్ భయం మాత్రం పోలేదు. ఇప్పటికే ఆ సిటీలో లాక్డౌన్ ఎత్తేసినా అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు అంటున్నారు. లక్షణాల్లేని వారిలోనూ వైరస్ ఉన్నట్టు పరీక్షల్లో తేలుతుండటం, ఇలాంటి కేసులు ఎక్కువవుతుండటంతో ముందు జాగ్రత్తగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చైనాలో ఇప్పటివరకు లక్షణాల్లేని కేసులు 1,075 బయటపడ్డాయి. దీంతో వుహాన్లోని 1.1 కోట్ల మందికి టెస్టులు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు అక్కడి మీడియా వెల్లడించింది.
చైనాలో నేడు జాతీయ సంతాప దినం
కరోనా వైరస్ వల్ల మరణించినవారికి చైనా సంతాపం తెలపనుంది.ఈ మేరకు శనివారం (ఏప్రిల్ 4వతేదీ) జాతీయ సంతాప దినంగా పాటించాలని చైనా సర్కారు నిర్ణయించింది. సంతాప దినం సందర్భంగా దేశమంతటా జాతీయ జెండాలను అవనతం చేస్తారు.శనివారం దేశంలో అన్ని రిక్రియేషన్ కార్యక్రమాలను రద్దు చేయనున్నట్టు సర్కారు ప్రకటించింది. కరోనా మృతులకు సంతాప సూచకంగా ఉదయం 10 గంటలకు దేశమంతటా జనం 3 నిమిషాల పాటు మౌనం పాటిస్తారు.