సిడ్నీ: ఇంటర్నేషనల్ టీ20ల్లో రెండు సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఆయా జట్ల కెప్టెన్లు.. ఛేజింగ్లోనే సెంచరీలు చేయడం విశేషం. విచిత్రమేంటంటే యావత్ క్రికెట్ అభిమానులకు ఇప్పటివరకు వారి పేర్లు పెద్దగా తెలియదు. తాజా రికార్డులతో ఈ ప్లేయర్లను మళ్లెప్పుడు మరిచిపోకుండా గుర్తుంచుకునేలా చేశాయి. ఇంతటి ఘనతనందుకున్న వారిలో ఒకరు నేపాల్ కెప్టెన్ ఖడ్క పారాస్ కాగా.. మరొకరు శ్రీలంక మహిళా కెప్టెన్ చమరి ఆటపట్టు. ఇంటర్నేషనల్ టీ20ల్లో ఛేజింగ్లో సెంచరీ చేసిన పురుషుల కెప్టెన్గా పారాస్.. మహిళల సారథిగా చమరి ఆటపట్టు రికార్డులకెక్కారు. పారాస్ సెంచరీతో తన జట్టును గెలిపించగా.. ఆటపట్టు మాత్రం విజయాన్నందించలేకపోయింది.
ముందుగా పారాస్
ముక్కోణపు సిరీస్లో భాగంగా సింగపూర్తో జరిగిన మ్యాచ్లో పారాస్ (52 బంతుల్లో 7 ఫోర్స్, 9 సిక్స్లతో 106) సెంచరీతో 152 పరుగుల లక్ష్యాన్ని నేపాల్ 4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. ఫలితంగా అంతర్జాతీయ టీ20ల్లో ఛేజింగ్లో సెంచరీ నమోదు చేసిన తొలి కెప్టెన్గా పారాస్ రికార్డులకెక్కాడు. అలాగే నేపాల్ తరఫున తొలి సెంచరీ చేసిన బ్యాట్స్మన్గా గుర్తింపుపొందాడు. 49 బంతుల్లోనే సెంచరీ సాధించి వేగవంతంగా ఈ ఫీట్ చేసిన నాలుగో ఆసియా కెప్టెన్గా పారాస్ నిలిచాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20ల్లో 218 పరుగుల లక్ష్య ఛేదనలో చమరి ఆటపట్టు (66 బంతుల్లో 113) సెంచరీ చేసి ఈ ఘనత సాధించిన తొలి మహిళా కెప్టెన్గా నిలిచింది.