గ్రాడ్యుయేట్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో అడ్రస్​లు గాయబ్

గ్రాడ్యుయేట్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో అడ్రస్​లు గాయబ్
  •     ఓటర్ల పేరు, క్వాలిఫికేషన్ తోనే సరిపెట్టిన ఎలక్షన్​కమిషన్
  •     క్రాస్​ చెకింగ్ అవకాశం లేకుండా చేశారనే విమర్శలు
  •     ప్రలోభాలకు గురిచేస్తారనే సీక్రెట్​గా ఉంచామంటున్న ఆఫీసర్లు
  •      పూర్తి డిటైల్స్​ ఇవ్వాలని పొలిటికల్​ పార్టీల డిమాండ్​

నల్గొండ, వెలుగు : ఈ నెల 1న ఎలక్షన్​ కమిషన్​రిలీజ్​ చేసిన గ్రాడ్యుయేట్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్​లో ఓటర్ల అడ్రస్​లు గాయబ్​ అయ్యాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ఈసీ తీసుకొచ్చిన కొత్త రూల్స్​ ప్రకారమే ఓటర్ల అడ్రస్​లు ఇవ్వలేదని ఆఫీసర్లు అంటుండగా, ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ సెగ్మెంట్ల పరిధిలో రూలింగ్​ పార్టీ భారీగా బోగస్​ ఓటర్లను నమోదు చేయించిందని ఇప్పటికే ఆరోపిస్తున్న వివిధ పార్టీల లీడర్లు,  తాజాగా తమ వాయిస్​ పెంచారు. ఓటర్ల అడ్రస్​లు లేకపోతే బోగస్ ఓటర్లను కనిపెట్టడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో డ్రాఫ్ట్ లిస్ట్​లో వివరాలు ఇన్​ కంప్లీట్​గా  ఉన్నాయంటూ ఇప్పటికే తెలంగాణ జన సమితితో పాటు, ఇతర పార్టీలకు చెందిన లీడర్లు  ఎలక్షన్ ​ఆఫీసర్లను కలిసి కంప్లైంట్ చేశారు.

 కొత్త రూల్​తో చిక్కులు..

నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 1న పబ్లిష్ చేసిన డ్రాఫ్ట్ లిస్ట్​లో మొత్తం 4,67,635 మంది ఓటర్లు ఉన్నారు. సుమారు 5.17 లక్షల ఆప్లికేషన్స్ వస్తే బీఎల్ఓల వెరిఫికేషన్​లో 49వేల908 ఆప్లికేషన్స్​ను తిరస్కరించారు. వివిధ రకాల కారణాలతో ఆప్లికేషన్స్ తొలగించినప్పటికీ మళ్లీ అప్లై చేసుకునే వెసులుబాటును ఎలక్షన్​ కమిషన్​ కల్పించింది. వీరితో పాటు కొత్త ఆప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇప్పటిదాకా ఎన్నికల కమిషన్  ప్రకటించిన అన్ని ఓటరు జాబితాల్లో ఓటర్లకు సంబంధించిన అన్ని వివరాలు ఉండేవి. అంటే ఓటర్ల పేరు, వయసు, రిలేషన్ తదితర వివరాలతో పాటు అడ్రస్​లు కూడా కనిపించేవి. కానీ తొలిసారిగా గ్రాడ్యుయేట్ ఎలక్షన్​లో కొత్త రూల్ తీసుకొచ్చారు. ఓటర్ల అడ్రస్​ను ప్రస్తావించకుండా కేవలం ఓటరు పేరు, వయసు, రిలేషన్ వివరాలు మాత్రమే పేర్కొన్నారు. దీంతో రాజకీ య పార్టీలు ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

ఓటర్ల వద్దకు వెళ్లడం ఎలా?

ఓటరు జాబితాలో అడ్రస్​లు లేకుంటే ఓటర్ల వద్దకు ఎలా వెళ్లగలమని పొలిటికల్ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడడంతో మూడు జిల్లాల పరిధి కాస్తా 12 జిల్లాలకు విస్తరించింది. వీటి పరిధిలో 186 మండలాలు, 546 పీఎస్​లు ఉన్నాయి. 12 జిల్లాలోని 4.67 లక్షల మంది ఓట ర్లను ఎలా కనిపెట్టాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. కేవలం పేర్లు మాత్రమే వెల్లడించడం ద్వారా ఎన్నికల ప్రచారం అంత తేలిగ్గా ఉండదని, వాటి ఆధారంగా ఓటరును ఎక్కడని వెతకగలమని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. అడ్రస్​తో పాటు, డిగ్రీ ఎక్కడి నుంచి పాసయ్యారో కూడా డ్రాఫ్ట్​ లిస్టులో పే ర్కొనాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఎన్నికల ఆఫీసర్లు మరొక వాధన వినిపిస్తున్నారు. ఓటర్లు ప్రలోభాలకు గురియ్యే పరిస్థితి రావొద్దనే ఎలక్షన్​ కమిషన్​ ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. ఓటర్ల అడ్రస్​లు గోప్యం గా ఉంచడం ద్వారా ఎలాంటి సమస్యలు రావని అంటున్నారు.

బోగస్ ఓటర్ల పైనే అనుమానాలు..

గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు అధికార పార్టీ బోగస్ ఓటర్లను చేర్చించిందని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.  ఓటరు ఎన్​రోల్​మెంట్​డ్రైవ్​ను సీరియస్​గా తీసుకొని గతకంటే రెట్టింపు స్థాయిలో నమోదు చేయించారు. అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువగానే ఎన్​రోల్​మెంట్​జరిగింది. అది కూడా నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఓటర్ ఎన్​రోల్మెంట్ రికార్డుస్థాయిలో చేశారు. దీంతో ఆం ధ్రా సరిహద్దుని ఆనుకుని ఉన్న నియోజకవర్గాల్లో కచ్చితంగా బోగస్ ఓటర్లు ఉంటారనే ప్రతిపక్ష పార్టీల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి విచారణ చేసినప్పటికీ వాళ్ల పైన రాజకీయ ఒత్తిళ్లు బలంగా పనిచేశాయని దీంతో బోగస్ ఓటర్లు జాబితాలో ఉండొచ్చని చెబుతున్నారు. డ్రాఫ్ట్​ లిస్టు పైన తాము ఆబ్జెక్షన్స్​ వ్యక్తం చేయాలన్నా ఓటర్ల అడ్రస్​లు లేకుండా ఎలా సాధ్యమవుతుంద ని ప్రశ్నిస్తున్నారు.

జాబితాలో అన్ని వివరాలు ఇవ్వాలి:

ఓటర్ల అడ్రస్​ను డ్రాఫ్ట్​ లిస్టులో తప్పనిసరిగా పేర్కొనాలి.  లేకపోతే బోగస్ ఓటర్లు వచ్చే ప్రమాదం ఉంది. డిగ్రీ ఎక్కడ పాసయ్యారో కూడా స్పష్టంగా చెప్పాలి. ఓటర్ల అడ్రస్​ క్లియర్​గా పేర్కొనకపోతే  వాళ్లు ఎక్కడ ఉన్నారో ఎలా తెలుస్తుంది? దీని పైన ఎలక్షన్ కమిషన్​కి ఫిర్యాదు చేస్తాం. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో ఓటర్లంతా అడ్రస్​లు ఇచ్చారు.

– నర్సిరెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ, నల్గొండ