రిగ్గింగ్​ వీడియో వైరల్ ​కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ ​శ్రావణ్​ అరెస్ట్

రిగ్గింగ్​ వీడియో వైరల్ ​కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ ​శ్రావణ్​ అరెస్ట్

మల్కాజిగిరి, వెలుగు : లోక్​సభ ఎన్నికల పోలింగ్​సందర్భంగా బహుదూర్ పురాలోని ఓ పోలింగ్​బూత్​లో రిగ్గింగ్ కు పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసిన కేసులో సీసీఎస్​ పోలీసులు మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్​కుమార్​తోపాటు మరో నలుగురిని అరెస్ట్​చేశారు. సీసీఎస్ పోలీస్​స్టేషన్​లో విచారిస్తున్నారు. ఈసీ ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగుతోంది. ఈ విషయాన్ని సీసీఎస్​పోలీసులు గురువారం రాత్రి వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే నాంపల్లికి చెందిన మహ్మద్ బీన్ అలీ, చాదర్​రఘాట్ కు చెందిన కాశీ, ముషీరాబాద్ కు చెందిన మితిలేశ్ కోర్టులో హాజరుపరిచామన్నారు.

కార్పొరేటర్​శ్రావణ్​పాత్రపై విచారణ కొనసాగుతోందని, శుక్రవారం ఉదయం కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే సీసీఎస్​పోలీసులు గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో కార్పొరేటర్​శ్రావణ్​కుమార్​ను అదుపులోకి తీసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఎలాంటి సమాచారం లేకుండా ప్రైవేట్​వెహికల్​లో ఎక్కించి తరలించడాన్ని చూసి, స్థానికులు, కార్పొరేటర్​కుటుంబ సభ్యులు శ్రావణ్​ను కిడ్నాప్​చేశారని అనుకున్నారు. కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు మల్కాజిగిరి పోలీస్​స్టేషన్​కు చేరుకుని వాకబు చేయగా, తమకు ఏమీ తెలియదని అక్కడి పోలీసులు చెప్పారు.

దీంతో శ్రావణ్​తండ్రి రాంబాబు మల్కాజిగిరి పీఎస్​లో తన కొడుకును గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్​చేశారని ఫిర్యాదు చేశారు. అదే సమయంలో బీజేపీ శ్రేణులు పోలీస్​స్టేషన్​ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. కొద్దిసేపటి తర్వాత స్పందించిన మల్కాజిగిరి పోలీసులు కార్పొరేటర్​శ్రావణ్​ను సీసీఎస్​పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. దీంతో వారంతా బషీర్​బాగ్​లోని సీసీఎస్ కు చేరుకుని అక్కడ ఆందోళనకు దిగారు. ఆందోళన అర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉంది. కాగా శ్రావణ్​కుమార్​పై గతంలో పలు కేసులు నమోదు అయినట్లు తెలిసింది.