- ఉపాధి కూలీల హాజరు నమోదులో సాంకేతిక సమస్యలకు చెక్..!
- ఎన్ఎంఎంఎస్ యాప్ నిబంధనల సడలింపు
- నెట్వర్క్ రాని చోట ఆఫ్ లైన్ లో అటెండెన్స్
- అంధులకు కనురెప్ప నిబంధన నుంచి విముక్తి
- ఈ-కేవైసీ పెండింగ్ ఉన్నా పని కల్పించేలా వెసులుబాటు
- కేంద్రం ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర కమిషనర్
హైదరాబాద్, వెలుగు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని చేసే కూలీలకు హాజరు నమోదులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలకు పరిష్కారం లభించింది. పని ప్రదేశాల్లో నెట్వర్క్ సమస్యలు, మొబైల్ యాప్ మొరాయించడం వంటి సాంకేతిక కారణాలతో కూలీలు వేతనాలు కోల్పోకుండా కేంద్రం నిబంధనలను సడలించింది. ఈ మేరకు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్)లో చేసిన మార్పులను వివరిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ డి.దివ్య తాజాగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ సమస్య ఉంటే ఇకపై పని ఆగకుండా చర్యలు చేపట్టనున్నారు.
ఎన్ఎంఎంఎస్ యాప్లో ఆఫ్ లైన్ మోడ్ ద్వారా హాజరు నమోదు చేయవచ్చు. ఇలా రికార్డు చేసిన హాజరు, ఫొటోలను సిగ్నల్ ఉన్న ప్రాంతానికి వచ్చాక మస్టర్ రోల్ ముగిసిన రెండు రోజుల్లోపు (టీ+2) అప్ లోడ్ చేసే వెసులుబాటు కల్పించారు.
మేట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఫోన్లు పనిచేయకపోయినా, సాంకేతిక లోపాలు వచ్చినా.. మరో ఫోన్ ద్వారా జన్మన్రేగా యాప్ను ఉపయోగించి జియో -ట్యాగ్ ఫొటోలతో హాజరు వేయవచ్చు. దీనికి సంబంధిత ప్రోగ్రామ్ ఆఫీసర్ అనుమతి తప్పనిసరి. అయితే, ఇప్పటివరకు ఫేస్ ఆథెంటికేషన్ కోసం కనురెప్ప ఆర్పడం తప్పనిసరి నిబంధన ఉంది. దీనివల్ల అంధులైన కూలీల హాజరు నమోదు కావడం లేదు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. డిజబిలిటీ సర్టిఫికెట్ సమర్పిస్తే వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపునిస్తూ సాధారణ ఫొటోతో హాజరు తీసుకుంటారు.
ఈ-కేవైసీ సమస్య ఉన్నా..
సాంకేతిక కారణాలతో ఈ-కేవైసీ పెండింగ్లో ఉన్నా సదరు కూలీ అర్హుడైతే పని కల్పించేలా వెసులుబాటు కల్పించారు. అధికారుల ధృవీకరణ తర్వాత ఫేస్ ఆథెంటికేషన్ లేకుండానే హాజరు తీసుకునే అవకాశం ఉంది. పెండింగ్ హాజరును 15 రోజుల్లో పరిష్కరించాలని, లేనిపక్షంలో సిస్టమ్ ఆ డేటాను శాశ్వతంగా తిరస్కరిస్తుందని కమిషనర్ హెచ్చరించారు.
