వైట్బాల్ ఫార్మాట్లో కీలక బౌలర్..! లోయర్ ఆర్డర్లో చాలా ఉపయుక్తమైన బ్యాట్స్మన్..! టీమిండియా పేస్ సెటప్లో అత్యంత ముఖ్యమైన ప్లేయర్.. బుమ్రా, షమీ, ఇషాంత్, ఉమేశ్.. వీళ్లలో ఎవరి కాంబినేషన్లోనైనా దీటుగా బౌలింగ్ చేయగల దిట్ట..! షార్ట్ ఫార్మాట్లో డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్..! వీటన్నింటికి మించి ఏ ఫార్మాట్లోనైనా కెప్టెన్కు నమ్మిన బంటుగా మారిన భువనేశ్వర్ కుమార్.. ఇంటర్నేషనల్ క్రికెట్లో అంతలా ఎదగడానికి గల కారణాలేంటి..! అతని కెరీర్లో టర్నింగ్ పాయింట్ ఏంటి..! అతని మాటల్లోనే విందాం..!!
న్యూఢిల్లీ: ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడటం.. తన కెరీర్కు అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అని టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసేటప్పుడు ఉండే ప్రెజర్ను హ్యాండిల్ చేయడం ఎలాగో నేర్చుకున్నానని చెప్పాడు. కెరీర్లో ఎదగడానికి సన్రైజర్స్ టీమ్ బాగా దోహదం చేసిందన్నాడు. ‘కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి యార్కర్లు వేయడం నాకు అలవాటు. తర్వాతి దశలో ఆ నైపుణ్యాన్ని కోల్పోయా. కానీ 2014లో సన్రైజర్స్లో జాయిన్ అయిన తర్వాత స్టార్టింగ్, డెత్ ఓవర్లలో నేనే బౌలింగ్ చేయాలని ఫ్రాంచైజీ కోరుకుంది. దీంతో మళ్లీ వాటిపై దృష్టిపెట్టా. ఆ సీజన్లో 14 మ్యాచ్లు ఆడా. స్లాగ్ ఓవర్లలో ప్రెజర్ను ఎలా హ్యాండిల్ చేయాలో అక్కడే నేర్చుకున్నా. అదే నా కెరీర్ను మలుపు తిప్పింది. సన్రైజర్స్కు ఆడినన్ని రోజులు కొత్త విషయాలు చాలా నేర్చుకున్నా’ అని భువీ వ్యాఖ్యానించాడు.
బాగా సక్సెస్ అయ్యా..
మాజీ కెప్టెన్ ధోనీలాగా.. ఫలితాన్ని పట్టించుకోకుండా ఆడినన్ని రోజులు బాగా సక్సెస్ అయ్యానని భువనేశ్వర్ తెలిపాడు. రిజల్ట్ను పట్టించుకోవడం మొదలుపెడితే.. బౌలింగ్ దెబ్బతింటుందన్నాడు. ‘రిజల్ట్స్కు దూరంగా ఉండటం నేర్చుకున్నా. ధోనీ కూడా అలానే చేస్తాడు. అతని బాటలోనే నేను వెళ్తున్నా. చిన్నచిన్న అంశాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నా. అందుకే తుది ఫలితంతో సంబంధం లేకుండా ఆడితే బాగా సక్సెస్ అయ్యా. నా కెరీర్లో చాలాసార్లు ఇది నిరూపితమైంది. మనకు ఇది ఓ రెఫరెన్స్లా పనికొస్తుంది. మనం కోరుకున్న ఫలితాన్ని కూడా అందిస్తుంది. ఐపీఎల్లో రెండు సీజన్స్ చాలా బాగా ఆడా. అప్పుడు నేను ఇదే జోన్లో ఉన్నా. నా పెర్ఫామెన్స్ పైనే ఎక్కువగా దృష్టిపెట్టేవాడిని. రిజల్ట్ను సెకండరీగా భావించేవాడిని. ఫైనల్గా ఫలితం పాజిటివ్గా ఉండేది’ అని భువనేశ్వర్ వివరించాడు.
అమ్మో చాలా కష్టం..
క్రికెట్ ఆడకుండా ఉండటం చాలా కష్టమని, లాక్డౌన్లో చాలా ఇబ్బంది పడ్డానని భువనేశ్వర్ వెల్లడించాడు. ‘లాక్డౌన్లో ఫస్ట్ 15 రోజులు నన్ను నేను మోటివేట్ చేసుకున్నా. దీని గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవడంతో ఇబ్బంది అనిపించలేదు. ఎక్సర్సైజ్ చేసేందుకు ఎక్విప్మెంట్స్ కూడా నా దగ్గర లేవు. రెండు నెలల్లో సాధారణ పరిస్థితులు వస్తాయని అనుకున్నా. కానీ 15 రోజుల తర్వాత అసలు కష్టం మొదలైంది.. ఇక తప్పదనుకుని ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ కొనుగోలు చేశా. తర్వాత వర్కౌట్స్ మొదలుపెట్టి క్రమంగా లాక్డౌన్ నుంచి బయటపడ్డా. ఆన్ ఫీల్డ్ పెర్ఫామెన్స్ ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువగా ఫిట్నెస్, అథ్లెటిక్ ఎబిలిటీ, స్ట్రెంత్పైనే ఎక్కువగా దృష్టి సారించా’ అని భువీ పేర్కొన్నాడు.
దురదృష్టం వల్లే ఓడాం
2013 నుంచి టీమిండియా ఐసీసీ ట్రోఫీలను గెలవకపోవడానికి సరైన కారణమంటూ ఏదీ లేదని భువీ అన్నాడు. తాము బాగా ఆడినా దురదృష్టవశాత్తు ఓడిపోయామన్నాడు. ‘చివరిసారి 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. ఆ తర్వాత మూడు, నాలుగు ఐసీసీ టోర్నీలు ఆడాం. సెమీస్, ఫైనల్ వరకు వెళ్లాం. కానీ మాకు కాలం కలిసి రాలేదు. 2015 వరల్డ్కప్ సెమీస్లో ఓడాం. 2019 వరల్డ్కప్ ఓ బ్యాడ్లక్. ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ త్వరగా ఔటవ్వడంతో మ్యాచ్ను కోల్పోయాం. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఆ టోర్నీ మొత్తం రోహిత్, రాహుల్, విరాట్, ధోనీ బాగా ఆడారు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో బుమ్రా వేసిన నో బాల్ తర్వాతే మ్యాచ్ స్వరూపం మారిపోయింది. కాబట్టి ఇవన్నీ అనుకోకుండా జరిగిన సంఘటనలు. మేం మా స్థాయికి తగినట్లుగానే పోరాడాం. ఓటమికి కచ్చితమైన రీజన్స్ చెప్పలేం’ అని భువీ చెప్పుకొచ్చాడు.