హైదరాబాద్, వెలుగు: ప్రత్యేక రాష్ట్రం వచ్చి పట్టుమని పదేండ్లు కూడా కాలే బీఆర్ఎస్ సర్కారు రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్రంలో ఆ పార్టీ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. నాగార్జున సాగర్ నుంచి దేవాదుల వరకు అన్ని భారీ సాగునీటి ప్రాజెక్టులు కాంగ్రెస్హయాంలో నిర్మించినవేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సర్కారు ఇన్నేండ్లలో గోదావరిపై ఒక్క కాళేశ్వరం తప్ప.. కృష్ణానదిపై ఒక్క ప్రాజెక్టును కూడా కట్టలేదని మండిపడ్డారు. శనివారం మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్కడి నుంచి గాంధీభవన్, సీఎల్పీకి వెళ్లి వైఎస్ ఫొటోలకు నివాళి అర్పించారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్కు తెలంగాణ మీద, తెలంగాణ సమాజం మీద అవగాహన లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు రాబందుల్లా రాష్ట్రాన్ని పీక్కుతింటున్నారని ఆరోపించారు. కాం గ్రెస్ హయాంలో ఇలాంటి అరాచకం లేదన్నారు.
కేటీఆర్ డీల్ మాట్లాడాకే.. బీజేపీ స్టేట్చీఫ్ మార్పు
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం ప్రేమ లేదని భట్టి ఆరోపించారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, కాజేపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఓ భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా తదితర వాటిలో ఒక్క హామీ కూడా బీజేపీ నెరవేర్చలేదని విమర్శించారు. తొమ్మిదేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేసిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఆ రెండు పార్టీలూ ఒక్కటేనన్నారు. కేటీఆర్ ఢిల్లీ వెళ్లి డీల్ మాట్లాడుకున్నాకే.. కిషన్రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని ఆరోపించారు. అవసరం, అవకాశం వచ్చిన ప్రతిసారీ బీజేపీకి కేసీఆర్ మద్దతిచ్చారన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం తమ కుటుంబ ఆర్థిక లాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఫైర్ అయ్యారు.
వైఎస్సార్ దార్శనికుడు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్ప దార్శనికుడని భట్టి అన్నారు. ఉమ్మడి ఏపీ అభివృద్ధి చెందాలని తపించిన గొప్ప లీడర్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా పాలన సాగించారన్నారు. పేదలకూ చదువు అందించాలన్న ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్మెంట్ వంటి గొప్ప స్కీమ్ను తీసుకొచ్చారన్నారు. రాజకీయాలు, కులమతాలకతీతంగా ఉమ్మడి రాష్ట్రంలో అర్హులందరికి సంక్షేమ పథకాలు అందించారన్నారు.