గుడిగండ్లలో మళ్లీ ఉద్రిక్తత : మృతదేహాల కోసం కుటుంబీకుల డిమాండ్

గుడిగండ్లలో మళ్లీ ఉద్రిక్తత : మృతదేహాల కోసం కుటుంబీకుల డిమాండ్

దిశ ఎన్ కౌంటర్ మృతుల తల్లిదండ్రులు ఇవాళ(శనివారం) ఉదయం మరోసారి ఆందోళనకు దిగారు. దీంతో వారి స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా గుడిగండ్ల గ్రామంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ బిడ్డల మృతదేహాలు అప్పగించి చివరి చూపునకైనా నోచుకునే అవకాశం కల్పించాలంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామం ప్రధాన రహదారి పై బైఠాయించారు. నిన్న(శుక్రవారం) సాయంత్రమే మృతదేహాలు అప్పగించి అంత్యక్రియలు జరిగేలా చూడాలని పోలీసులు భావించినా వారి ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ విషయం తెలియని బాధితులు రాత్రి 10 గంటల వరకు శవాల కోసం ఎదురు చూశారు. రోడ్డు పై బైఠాయించి మృతదేహాలు అప్పగించాలని డిమాండ్ చేశారు. పోలీసులు విషయం తెలియజేసి వారిని శాంతింపజేశారు.

ఇవాళ ఉదయం మళ్లీ బాధిత కుటుంబాలు రోడ్డు పై బైఠాయించి మృతదేహాలు అప్పగించాలని కోరారు. వీరికి గ్రామస్థులు కూడా మద్దతుగా నిలవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులే మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తారేమోనన్న అనుమానంతో ఆందోళన వ్యక్తం చేశారు.

మా కుటుంబీకుల అంత్యక్రియలు నిర్వహించడానికి మీరెవరు. వారి మృతదేహాలు మాకు అప్పగించండి. మా విధాయకం ప్రకారం మేమే కార్యక్రమం నిర్వహించుకుంటాం అంటూ డిమాండ్ చేశారు. పోలీసు అధికారులు కలుగజేసుకొని.. కోర్టు ఆదేశాలను వివరించి శవాలను మీకే అప్పగిస్తామని, మీ సంప్రదాయం ప్రకారమే అంత్యక్రియలు జరిపేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.