IAS,IPS లపై ఇంటెలిజెన్స్ నిఘా

IAS,IPS లపై ఇంటెలిజెన్స్ నిఘా
  • అధికారుల ఆస్తులు, భూముల చిట్టా తీస్తున్న ఇంటెలిజెన్స్
  • ప్రభుత్వ సబ్సిడీలను వాడుకున్న ఇంకొందరు ఆఫీసర్లు

హైదరాబాద్‌, వెలుగురాష్ట్రంలో ప్రస్తుతం 138 మంది ఐఏఎస్‌లు,  93 మంది ఐపీఎస్‌ లున్నారు. వీరిలో 24 మంది ఆఫీసర్లు గ్రేటర్‌ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల పరిధిలో భారీ మొత్తంలో భూములను కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. సెటిల్‌ మెంట్లు, కబ్జాల పేరిట కొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల కనుసన్నల్లోనే భారీ మొత్తంలో భూములు చేతులు మారినట్టు ఫిర్యాదులున్నాయి. మైనింగ్‌, గుట్కా, దో నంబర్‌ దందాలకి వత్తాసు పలికిన అధికారులు తమ సంపాదనను రియల్‌ ఎస్టేట్స్‌ వైపు మళ్లించినట్లు ఇంటెలిజెన్స్‌ విభాగం వద్ద సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. కొందరు అధికారులు రంగారెడ్డి, సంగారెడ్డి, కొకాపేట్‌‌‌‌ లలో సెటిల్మెంట్లతో, మరికొందరు ఐఏఎస్‌‌‌‌లు, ఐపీఎస్‌‌‌‌లకు పారిశ్రామిక వేత్తలు తమవంతు గిఫ్టులుగా ప్లాట్స్‌‌‌‌ , ఫ్లాట్లు కట్టబెట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తోంది. గ్రేటర్‌‌‌‌ పరిధిలో కీలక పోస్టులో ఉన్న పోలీస్‌‌‌‌ అధికారి ఉమ్మడి నల్గొండ జిల్లాల పరిధిలో మూడేళ్ల వ్యవధిలోనే దాదాపు నలభై ఎకరాల భూములను కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్నారు. హోం శాఖలో కీలకంగా ఉన్న ఒక అధికారి నగరం చుట్టూరా అయిదు చోట్ల భూములను కొనుగోలు చేసినట్లు సమాచారం.

గ్రేటర్‌‌‌‌ చుట్టూరా ఉన్న భూములతో పాటు వందల కోట్లకు పడగలెత్తిన రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ వెంచర్లలో ముగ్గురు ఐపీఎస్‌‌‌‌లకు వాటాలున్నాయని అనుమానిస్తున్నారు. కరీంనగర్, వరంగల్‌‌‌‌ జిల్లాల్లో వివిధ హోదాల్లో పని చేసిన ఐపీఎస్‌‌‌‌ లు ఇటీవల ఆయా నగరాల చుట్టూరా భూములను కొనుగోలు చేసిన తీరును నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. గతంలో జిల్లా పోస్టింగుల్లో చక్రం తిప్పి ఇప్పుడు సిటీలో కీలక పోస్టింగుల్లో పనిచేస్తున్న ఓ అధికారికి భారీ ల్యాండ్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ ఉన్నట్టు తెలుస్తోంది. మొన్నటిదాకా  ప్రభుత్వంలో కీలక శాఖల్లో పనిచేసిన సీనియర్‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌ అన్నీ తానై సైబర్‌‌‌‌ సిటీ ఏరియాలో ఓ ప్రైవేట్‌‌‌‌ ఆఫీసుని తెరిచి తెరవెనుక సెటిల్మెంట్స్‌‌‌‌ చేస్తున్నట్టు ఫిర్యాదులందాయి. గత ఏడాది మియాపూర్‌‌‌‌ సమీపంలో వెలుగులోకి వచ్చిన కోట్లాది రూపాయల భూముల కుంభకోణంలో సీఎంవో ఆఫీసుతో పాటు కీలక విభాగంలో పని చేసే ఇద్దరు ఐఏఎస్‌‌‌‌ లకు ప్రమేయముందని ప్రచారం జరిగింది.

నిరుడు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు పాలీహౌజ్‌‌‌‌ లు ఏర్పాటు చేసుకునే రైతులకు 95 శాతం సబ్సిడీపై రుణాలను మంజూరు చేసింది. కొందరు లబ్ధిదారులకు రూ.25 లక్షలకు పైగా సబ్సిడీ విడుదల చేసింది. గ్రేటర్‌‌‌‌ సిటీ చుట్టుపక్కల భూములున్న కొందరు బ్యూరోక్రాట్లు వివిధ పేర్లతో ఈ పాలీహౌజ్‌‌‌‌ల సబ్సిడీలను తమ జేబులో వేసుకున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. ఇప్పటికే ఈ వివరాలను తీసుకున్న ఇంటెలిజెన్స్‌‌‌‌ ఎవరెవరికి సబ్సిడీలు మంజూరయ్యాయి.. వారందరూ బినామీలా..  వారి పేరిట ఎన్ని ఎకరాల భూములున్నాయి..? ఐఏఎస్‌‌‌‌ అధికారులకు వారికున్న లింకేమిటీ అని లోతుగానే దర్యాప్తు చేస్తోంది.

కేంద్ర హోంశాఖ పరిధిలోని పర్సనల్‌‌‌‌ డిపార్టుమెంట్‌‌‌‌ నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది ఆల్‌‌‌‌ ఇండియా సర్వీసెస్‌‌‌‌ అధికారులు  విధిగా తమ స్థిరాస్తుల వివరాలను వెల్లడించాలి. కానీ కొందరు అధికారులు ఈ వివరాలను సమర్పించలేదు. నిరుడు 22 మంది, ఈ ఏడాది 18 మంది అధికారులు వీటిని డీవోపీటీకి అందించలేదు. ఆస్తుల వివరాలు సమర్పించిన అధికారుల్లో కొందరు తమ కుటుంబీకులు, బినామీల పేరిట కూడబెట్టిన ఆస్తుల వివరాలను దాచిపెట్టిన  ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్‌‌‌‌ వింగ్‌‌‌‌  ఐఏఎస్, ఐపీఎస్‌‌‌‌ ల ఆస్తులను తవ్వి తోడుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగా స్టేట్‌‌‌‌ కేడర్‌‌‌‌ లో పనిచేస్తున్న కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌‌‌‌లకు సంబంధించిన ఆస్తుల వివరాలను వాళ్ల సొంత రాష్ట్రాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.