- స్టూడెంట్లు, ఎక్స్పర్ట్స్ అభిప్రాయం
- పరీక్షకు 95 శాతం మంది హాజరు
హైదరాబాద్, వెలుగు: మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో ఈసారి ప్రశ్నలు కాస్త కఠినంగా వచ్చాయని స్టూడెంట్లు, ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడ్డారు. ఫిజిక్స్ పార్ట్ చాలా టఫ్గా ఉండగా, కెమిస్ర్టీ కొంత సులభంగా ఉందన్నారు. చాలా ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లోని టేబుల్స్, ఫిగర్స్ నుంచి నేరుగా వచ్చాయని స్టూడెంట్లు చెప్పారు. స్టేట్మెంట్ ఇచ్చి దానికి అనుబంధ ప్రశ్నలు కూడా ఎక్కువగా ఇచ్చారని తెలిపారు. మన రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లోని 112 సెంటర్లలో పరీక్ష జరిగింది. సుమారు 40 వేల మంది హాజరయ్యారు. మాస్కు పెట్టుకున్న స్టూడెంట్లనే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. చెవి పోగులు, రింగులు సహా ఆభరణాలన్నింటినీ హాల్ బయటే తీసేయించారు. కరోనా పాజిటివ్ స్టూడెంట్లను వేరే గదుల్లో ఉంచి పరీక్ష రాయించారు. 90–95 శాతం మంది స్టూడెంట్లు నీట్ ఎగ్జామ్కు హాజరైనట్టు అధికారులు వెల్లడించారు.