- త్వరలో కొత్త స్క్రాపేజ్ పాలసీ అమల్లోకి
- రాష్ట్రంలో 15 ఏండ్లు నిండిన బండ్లు 30.7 లక్షలు
- ఫిట్నెస్, ఆర్సీ రెన్యూవల్కు పెరగనున్న చార్జీలు
- స్క్రాప్ సర్టిఫికెట్ ఉంటే కొత్త బండ్లు కొనేటప్పుడు ఇన్సెంటివ్స్
హైదరాబాద్, వెలుగు: 15 ఏండ్లు దాటిన పాత బండ్లను ఇకపై రోడ్డుపైకి తేవడం కుదరదు. వాటన్నింటినీ స్క్రాప్ చేయాల్సిందే. కేంద్రం తీసుకొచ్చిన కొత్త స్క్రాపేజ్ పాలసీ ప్రకారం.. 15 ఏండ్లు దాటిన కమర్షియల్ వెహికల్స్, 20 ఏండ్లు దాటిన నాన్ కమర్షియల్ బండ్లు ఫిట్నెస్ లేకుంటే తుక్కు కింద మార్చాల్సిందే. ప్రస్తుతం మన రాష్ట్రంలో 15 ఏండ్లు నిండిన వాహనాలు 30.7 లక్షలు ఉన్నాయి. వాటిని చెక్ చేసిన తర్వాత ఫిట్నెస్ ఉన్న బండ్లకు మాత్రమే రోడ్డెక్కేందుకు పర్మిషన్ ఇవ్వనున్నారు. టూవీలర్ల ఫిట్నెస్పై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ కొత్త స్క్రాపేజ్ పాలసీని ప్రారంభించారు. ఈ ఏడాది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఫిట్నెస్ టెస్ట్, స్క్రాపింగ్ సెంటర్ల ఏర్పాటుకు రూల్స్ అమల్లోకి రానున్నాయి.
15 ఏళ్లు పైబడిన ప్రభుత్వ వాహనాల స్క్రాపింగ్ 2022 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది. కమర్షియల్ వెహికల్స్కు 2023 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి, మిగతా వాహనాలకు 2024 జూన్ నుంచి దశలవారీగా ఫిట్నెస్ టెస్ట్ పెట్టనున్నారు. రాష్ట్రంలో 15 ఏండ్లు నిండిన వాహనాలు 30.70 లక్షలు (ఈ ఏడాది ఫిబ్రవరి దాకా) ఉన్నాయి. ఇందులో నాన్ కమర్షియల్ కార్లు 3 లక్షలు ఉన్నాయి. ఇవి కాకుండా ట్రక్కులు, మోటార్క్యాబ్లు, మ్యాక్సీ క్యాబ్లు, ట్రాక్టర్లు, టూవీలర్లు, స్టేజీ క్యారియర్లు, సరుకురవాణా వాహనాలు, ఇతర వాహనాలు ఉన్నాయి. అయితే స్క్రాప్ పాలసీలో టూవీలర్స్కు గురించి ఎక్కడా ప్రస్తావించలేదని అధికారులు చెబుతున్నారు.
ఫిట్నెస్ లేకుంటే తుక్కే..
15 ఏళ్లు దాటగానే వాహనాలకు ఫిట్నెస్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా మంది వాహన యజమానులు పొల్యుషన్ సర్టిఫికెట్ లేకుండానే నడిపిస్తున్నారు. రూల్స్ ప్రకారం 15 ఏళ్లు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్ను పునరుద్ధరించుకుంటే మరో ఐదేళ్ల వరకు నడుపుకొనేందుకు రవాణా శాఖ అనుమతిస్తుంది. కానీ కొత్త విధానంలో భాగంగా వాహనాలన్నింటికీ తప్పనిసరిగా ఫిట్నెస్ టెస్ట్ చేయించాలి. అందులో ఫెయిల్ అయితే నెల రోజుల్లోగా మరో చాన్స్ ఇస్తారు. ఆ తర్వాత కూడా ఫెయిలైతే వారం రోజుల్లోపు అప్పీలు చేసుకోచ్చు. అక్కడ కూడా పాస్ కాకుంటే బండిని స్క్రాప్ చేయాల్సి ఉంటుంది. స్క్రాప్ చేయడానికి స్క్రాపింగ్ యార్డులను ఏర్పాటు చేయనున్నారు.
ఇన్సెంటివ్స్ కూడా..
పాత బండ్లను తుక్కు చేసేందుకు ప్రోత్సాహకాలను కూడా కేంద్రం ప్రకటించనుంది. స్క్రాపింగ్ సెంటర్ నిర్ధారించే పాత వాహనం తుక్కు విలువ మేర కొత్త వాహనం ఎక్స్షోరూం ధరలో దాదాపు 4 శాతం నుంచి 6 శాతం మినహాయింపు ఇస్తారు. వ్యక్తిగత వాహనాల రోడ్డు పన్నుల్లో 25 శాతం, కమర్షియల్ వెహికల్స్ రోడ్డు ట్యాక్స్లో 15 శాతం మేర రాయితీ కల్పిస్తారు. కొత్త వాహన రిజిస్ట్రేషన్ ఫీజును రద్దు చేస్తారు. మాన్యుఫాక్చర్ డిస్కౌంట్ 5 శాతం ఉంటుంది. అయితే ఈ ప్రోత్సాహకాలు పొందేందుకు బండి స్క్రాప్ చేసిన సర్టిఫికెట్ ఉండాలి.
ఆర్సీ రెన్యువల్ చార్జీల పెంపు!
పొల్యుషన్ తగ్గించడంలో భాగంగా స్క్రాపేజ్ పాలసీని కేంద్రం తీసుకొచ్చింది. అయితే 15 ఏండ్లు, 20 ఏండ్లు దాటిన తర్వాత కూడా బండ్లను రెన్యూవల్ చేసుకునే అవకాశం ఉండటంతో.. వీటిని తగ్గించేందుకు ప్లాన్ చేస్తోంది. ఫిట్నెస్ టెస్ట్, ఆర్సీ రెన్యువల్ చార్జీలు పెంచనుంది. రెన్యువల్ చార్జీలను వాహనాన్ని బట్టి నిర్ధారించనున్నారు. ఆర్సీ రెన్యువల్ ఇన్టైంలో చేసుకోవాలి. లేకుంటే దానికి కూడా భారీగా ఫైన్ వేస్తారు. పాత బండ్లను తగ్గించడం ద్వారా పొల్యుషన్ను 20 నుంచి 30 శాతానికి తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇంధనం కూడా ఆదా కానుంది.