హైదరాబాద్, వెలుగు: మంత్రి కేటీఆర్ పర్సనల్ సెక్రటరీ పేరుతో మోసాలు చేస్తున్న ఇద్దరు సభ్యుల ముఠా గుట్టురట్టయింది. కాలేజీల్లో సీట్లు, ఉద్యోగుల ట్రాన్స్ఫర్లతో పాటు సీఎం కార్యాలయం నుంచి మెడికల్ స్కీమ్స్లో డబ్బులు ఇప్పిస్తామని చీటింగ్ చేస్తున్న ఇద్దరిని మల్కాజ్గిరి ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద రూ.1.75 లక్షల క్యాష్తో పాటు నకిలీ లెటర్లు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు చార్టెడ్ అకౌంటెంట్, మరొకరు మెకానికల్ ఇంజినీర్.
సెక్రటేరియెట్లో ఉన్న పరిచయాలతో..
మల్కాజ్గిరి గీతానగర్కు చెందిన రూపకుల కార్తీకేయ(51) చార్టెడ్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్నప్పుడు ఆయా కంపెనీల కన్సల్టింగ్ పనులు, బిజినెస్ ప్రపోజల్స్, ప్రాజెక్టు రిపోర్టులతో పాటు ఆర్థిక లావాదేవీల కార్యకలాపాలు చూసుకునేవాడు. ఈ క్రమంలోనే కేటీఆర్ పీఎస్ శ్రీనివాస్ వివరాలు తెలుసుకున్నాడు. సెక్రటేరియట్కు రోజూ వెళ్తుండటంతో అక్కడి అధికారులను పరిశీలించాడు. తరువాత మంత్రుల సిఫార్సులు, ప్రభుత్వ పథకాల పేరుతో అమాయకులను ట్రాప్ చేసేందుకు స్కెచ్ వేశాడు.
ఇలా స్కెచ్ వేశాడు
స్నేహితుడు ఫ్రెడ్రిక్ టేలర్(44)కు కార్తికేయ తన ప్లాన్ చెప్పాడు. మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి వ్యాపారం చేస్తున్న ఫ్రెడ్రిక్.. ఈజీ మనీ కోసం ఆ ప్లాన్కు ఓకే అన్నాడు. కేటీఆర్ పీఎస్గా కార్తికేయ మాట్లాడుతూ అమాయకులను మోసం చేసేవాడు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ మారేడ్పల్లిలోని కస్తూర్భా గాంధీ మహిళా డిగ్రీ కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీరాముల రాజుకు కార్తికేయ ఫోన్ చేశారు. కాలేజీలో తన స్నేహితుడి కూతురుకు సీటు ఇప్పించాడు. అందుకు స్నేహితుని వద్ద రూ.90 వేలు వసూలు చేశాడు. కార్తికేయను నమ్మిన శ్రీరాముల రాజు.. తన కొడుకు వైద్య ఖర్చుల కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్వోసీ) ఇప్పించాలని కోరగా సీఎంవో నుంచి 2 లక్షలు ఇస్తున్నట్టు రాజుకు నకిలీ లెటర్ ఇచ్చారు. దానిని హాస్పిటల్ యాజమాన్యానికి ఇవ్వగా వాళ్లు దాన్ని క్యాష్ చేసుకోవడానికి సబ్మిట్ చేయడంతో మోసం బయటపడింది. ఘట్కేసర్ పోలీసులకు రాజు ఫిర్యాదు చేశాడు. ఈ కేటుగాళ్లను మల్కాజ్గిరి ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు.