- రాష్ట్రంలో హైడెన్సీ విధానంతో కూరగాయల సాగు
- పైలట్గా నల్గొండ, యాదాద్రి, సూర్యాపేటల్లో..
- రైతులకు నాబార్డు ట్రైనింగ్, ఆర్థిక సాయం
హైదరాబాద్, వెలుగు:
ఇన్నాళ్లూ సీజన్కో పంట పండించిన రైతులు మెల్లమెల్లగా రోజువారీ ఆదాయమొచ్చే పంటల వైపు మళ్లుతున్నరు. పెట్టుబడి తక్కువుండటం, పైగా మస్తు ఆదాయం వస్తుండటంతో మల్టీ క్రాపింగ్పై మక్కువ జూపుతున్నరు. ఎకరాకు నెలకు రూ. లక్షకు పైనే ఆదాయం వస్తుండటంతో కూరగాయలు, పూల సాగు వెనుకవడ్తున్నరు. హైడెన్సీ పద్ధతిలో పంటలు పండిస్తూ ‘హై’ ఇన్కమ్ పొందుతున్నరు.
రోజువారీ ఆదాయమొచ్చే..
మామూలుగా రైతులు సీజన్కో పంట పండిస్తుంటరు. ఎక్కువగా వరి, పత్తి, జొన్న వేస్తుంటరు. కానీ పంట కోసం ఆరేడు నెలలు కష్టపడ్డాక పెట్టిన పెట్టుబడైనా వస్తదో రాదో తెలియని పరిస్థితి. అందుకే ఉద్యాన పంటలపై ఆసక్తి చూపిస్తున్నారు. రోజువారీ ఆదాయమొచ్చే కూరగాయలు, పూల సాగు చేస్తున్నారు. దీనికి హైడెన్సీ అనే మల్టీ క్రాపింగ్ పద్ధతిని అమలు జేస్తున్నారు. హైదరాబాద్ శివార్లలోని నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానంలో పంటలు పండిస్తున్నారు. గత మార్చిలో మొదలైన ఈ విధానం ట్రైనింగ్ను, ఆర్థిక సాయాన్ని రైతులకు నాబార్డు అందించింది. 25 ఎకరాల్లో పంటలేసేందుకు ఫార్మర్స్ సెక్టార్ ప్రమోషన్ ఫండ్ ద్వారా గ్రూపుకు 25 మందికి చొప్పున ట్రైనింగ్ ఇచ్చింది.
15 నుంచి 45 రోజుల్లోనే..
కుదుర్లుగా పెరిగే పచ్చి మిర్చి, వంకాయ, బెండ, గోరు చిక్కుడు, టమాట.. తీగ పంటలైన సొర, కాకర, దొండ, బీర, దోస పంటలను పైలట్గా రైతులు పండిస్తున్నారు. నేలవాటుగా పెరిగే బుడుమ దోస, దోస, పుచ్చకాయ పంటలను వేస్తున్నారు. ఇంకొంత భాగంలో పాలకూర, చుక్కకూర, కొత్తిమీర పెంచుతున్నారు. చేను చుట్టూ బంతిపూల తోటనూ సాగు చేస్తున్నారు. 15 నుంచి 45 రోజులకో పంట చేతికి వస్తోంది. పంటలైపోయాక బంతి రెడీ అవుతోంది. ఇలా ఎకరానికి రోజుకు క్వింటాల్ నుంచి రెండు క్వింటాళ్ల వరకు కూరగాయల దిగుబడి వస్తోంది. సీజన్, సాయిల్ను బట్టి నెలకు 40 టన్నులు వస్తోందని రైతులు చెబుతున్నారు.
ఏంటీ హైడెన్సీ?
పంట చేలల్లో సాలుకు సాలుకు మధ్య స్థలం ఎక్కువ వదులుతారు. ఒక ఎకరంలోనే 15 రకాల పంటల వరకు సాగు చేస్తారు. నేలపై కవరింగ్ రాప్టర్ పద్ధతిలో పేపర్ను మల్చింగ్లా ఏర్పాటు చేస్తారు. దీని వల్ల పొలంలో కలుపు మొక్కలు పెరగవు. మొక్కల వేర్లకూ సమస్యలుండవు. నీళ్లను డ్రిప్ ద్వారా అందిస్తారు. ఎకరం పొలంనే విభజన చేసి కుదుర్లుండే, నిటారుగా పెరిగే, తీగ పంటలను సాలుకొకటి చొప్పున పండిస్తారు.
తక్కువలో తక్కువ రూ. 3 వేలు
హైడెన్సీతో అన్ని రకాల పంటలు పండిస్తున్నా. రోజూ 2, 3 క్వింటాళ్లు మార్కెట్కు తీసుకెళ్తున్నా. తక్కువలో తక్కువ రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఆదాయం వస్తోంది. కొన్ని సీజన్లలో రెండింతలు వస్తోంది. కూరగాయలతోనే నెలకు రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు పైగా సంపాదిస్తున్నా. – ముఖేశ్, నల్గొండ జిల్లా
రోజూ పైసలొస్తున్నయ్
గతంలో ఉత్పత్తికి ఎక్కువ టైం పట్టే పంటలేశా. ఆదాయం అనుకున్నంత రాలేదు. పోయిన మార్చి నుంచి హైడెన్సీతో రకరకాల పంటలేస్తున్నా. గతంలో కంటే రెట్టింపు ఆదాయం వస్తోంది. అది కూడా ప్రతి రోజూ. సొంతంగా మార్కెట్ చేసుకుంటే ఇంకా లాభం.- చందు, నాంపల్లి, యాదాద్రి జిల్లా
మరిన్ని వార్తలు