‘వెలుగు’ రిపోర్టర్ కుటుంబానికి మాజీ ఎంపీ పొంగులేటి ఆర్థిక సహాయం

‘వెలుగు’ రిపోర్టర్ కుటుంబానికి మాజీ ఎంపీ పొంగులేటి ఆర్థిక సహాయం

ఖమ్మం:  టీఆర్ఎస్ నాయ‌కులు, జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం కూసుమంచి మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇటీవల గుండెపోటుతో మరణించిన సీనియర్‌ జర్నలిస్టు, వెలుగు పత్రిక కూసుమంచి మండల విలేఖరి షేక్ అబ్దుల్ సలామ్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. అబ్దుల్ సలామ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి సంతాపం వ్యక్తం చేశారు. అత‌ని మరణం చాలా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక విలువ కలిగిన వృత్తిలో ఉంటూ జర్నలిస్ట్ గా మంచి సేవాలందించారని అలాంటి జర్నలిస్ట్ ని కోల్పోవటం బాధాకరమన్నారు. అబ్దుల్ సలామ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెలుగు దినపత్రికలో అబ్దుల్ సలామ్ పాత్ర మరువరానిదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించిన అబ్దుల్ సలామ్ అందరికీ ఆదర్శప్రాయులు అన్నారు.