నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కుప్పకూలి ఒకరు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం బీహార్ లోని సుపాల్ జిల్లాలో జరిగింది. మరీచా సమీపంలో భేజా మరియు బకౌర్ మధ్య కోసీ నదిపై భారీ వంతెనను నిర్మిస్తున్నారు. అయితే, 2024, మార్చి 22వ తేదీ శుక్రవారం ఉదయం నిర్మాణంలో ఉన్న ఒక్కసారిగా కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారని.. మరో తొమ్మిది మంది గాయపడ్డారని సుపాల్ డీఎం కౌశల్ కుమార్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని ఆయన చెప్పారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.