ఇద్దరు చిన్నారులను ఎత్తుకెళ్లిన మహిళ
పిల్లలను రెస్క్యూ చేసిన పోలీసులు
నిందితురాలు అరెస్టు
హైదరాబాద్,వెలుగు: వారం క్రితం చార్మినార్ దగ్గర జరిగిన ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ కేసును సిటీ సౌత్ జోన్ పోలీసులు ట్రేస్ చేశారు. కిడ్నాప్ చేసిన మహిళను సోమవారం అరెస్ట్ చేసి పిల్లలను రెస్క్యూ చేశారు మహబూబ్నగర్ జిల్లా పోతలమడుగు గ్రామానికి చెందిన పనగంటి గంగమ్మ(55) సిటీలో భిక్షాటన చేస్తోంది. ఈ నెల 10న తన కూతురి మనవళ్లు శంకరయ్య(7),శివప్రసాద్(4),మనవరాలు మనెమ్మ(9)తో కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మీ టెంపుల్ వద్దకు వచ్చిన గంగమ్మ అక్కడే ఉంటూ భిక్షాటన చేస్తోంది. శంకరయ్య,శివప్రసాద్ ఈ నెల14న కనిపించకుండా పోయారు. గంగమ్మ చార్మినార్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. భాగ్యలక్ష్మీ టెంపుల్ సమీపంలో చిన్నారులను తీసుకెళ్తున్న మహిళ ఫుటేజ్ కలెక్ట్ చేశారు. ఆ మహిళ చిన్నారులతో కలిసి ఎల్ బీనగర్ క్రాస్ రోడ్స్ కి వెళ్ళినట్లు గుర్తించారు.
ఆటోడ్రైవర్లు ఇచ్చిన సమాచారంతో
సీసీఫుటేజ్, ఫొటోలతో రాచకొండ పోలీసులను సిటీ సౌత్ జోన్ పోలీసులు అలర్ట్ చేశారు. ఆటో డ్రైవర్స్ వాట్సాప్ గ్రూప్స్లో వీటిని సర్య్యులేట్ చేశారు. ఆటోడ్రైవర్లు ఇచ్చిన సమాచారంతో కిడ్నాపర్ను గుర్తించారు. పిల్లలను కిడ్నాప్ చేసిన వకేటి మల్లమ్మ అలియాస్ పద్మ(32)ను అదుపులోకి తీసుకున్నారు. కర్మన్ ఘాట్ కి చెందిన మల్లమ్మ భిక్షాటన చేస్తున్నట్లు సౌత్ జోన్ డీసీపీ గజరావ్ భూపాల్ తెలిపారు. గతంలో ఆమె తన పిల్లలతో భిక్షాటన చేయిస్తుండగా ఆదిబట్ల పోలీసులు వారిని రెస్క్యూ చేసి బండ్లగూడ, హయత్ నగర్ లోని చైల్డ్ హోమ్ లో అడ్మిట్ చేశారన్నారు. దీంతో బెగ్గింగ్ చేయించేందుకు చిన్న పిల్లలను కిడ్నాప్ చేయాలని మల్లమ్మ స్కెచ్ వేసిందన్నారు. ఈ నెల 14న చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద కనిపించిన శంకరయ్య, శివప్రసాద్ ను చాక్లెట్ ఇస్తానని చెప్పి ఎత్తుకెళ్లిందని ఆయన చెప్పారు. మల్లమ్మ కిడ్నాప్ చేసిన పిల్లలను రెస్క్యూ చేసి వారిని కూడా చైల్డ్ హోమ్ కి తరలించామన్నారు.