- 2,260 వైన్స్ కోసం లక్షా 31వేల దరఖాస్తులు
- రాష్ట్ర ఖజానాలో రూ.2,629 కోట్లు జమ
- రేపు లక్కీ డ్రా తీయనున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,260 వైన్స్ కోసం మొత్తం లక్షా 31వేల 490 టెండర్ అప్లికేషన్లు వచ్చాయి. 15 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ ఖజానాలో రూ.2,629 కోట్లు జమ అయ్యాయి. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో టెండర్ అప్లికేషన్లు రాలేదు. రెండేండ్ల కిందటితో పోలిస్తే దరఖాస్తులు రెట్టింపు స్థాయిలో వచ్చాయి. ఒక్కో మద్యం దుకాణానికి యావరేజ్గా 50 మంది చొప్పున పోటీపడుతున్నారు.
వాస్తవానికి ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువే అప్లికేషన్లు రావడంతో భారీగా ఆదాయం సమకూరింది. సోమవారం లక్కీ డ్రా తీయనున్నారు. ఆ తర్వాత 22వ తేదీన లైసెన్స్ ఫీజులో మొదటి ఇన్స్టాల్మెంట్ను వైన్స్దక్కించుకున్నోళ్లు ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది. దీంతో కూడా ప్రభుత్వానికి దాదాపు రూ.300 కోట్ల మేర ఆదాయం రానుంది. ఇలా కేవలం వైన్స్ టెండర్లతోనే ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయాల దాకా అర్జిస్తున్నది.
రెండు చోట్ల 10 వేలు దాటిన అప్లికేషన్లు
వైన్స్లకు అత్యధికంగా అప్లికేషన్లు వచ్చిన దాంట్లో సరూర్ నగర్ మొదటి ప్లేస్లో ఉన్నది. ఇక్కడ ఏకంగా 10,908 అప్లికేషన్లు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో శంషాబాద్కు 10,811 దరఖాస్తులు వచ్చాయి. ఏపీ బార్డర్లుగా ఉన్న ఖమ్మంలో 7,207, నల్లగొండలో 7,058 అప్లికేషన్లు రాగా.. మేడ్చల్లో 7,017 దరఖాస్తులు వచ్చాయి.కేవలం ఈ ఐదు ప్రాంతాలు కలిపితేనే 36 వేల అప్లికేషన్లు అవుతున్నాయి. తక్కువ అప్లికేషన్లు ఆసిఫాబాద్లో 967, ఆదిలాబాద్ లో 979, గద్వాలలలో 1179 వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.