హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో 13 మందికి కరోనా సోకింది. కొత్తగా గద్వాల జిల్లాలో 9, గ్రేటర్ హైదరాబాద్లో రెండు, రంగారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 983కు చేరింది. ఇందులో శుక్రవారం నాటికి 291 మంది డిశ్చార్జి అయ్యారని హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ తెలిపారు. కోఠిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.డిశ్చార్జి అయినవారిలో కరీంనగర్కు చెందిన ఒకరికి 28 రోజుల తర్వాత మళ్లీ వైరస్ పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 663 మంది ట్రీట్మెంట్ పొందుతున్నారని వెల్లడించారు. అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని, ఏడుగురు మాత్రం వెంటిలేటర్పై ఉన్నారని తెలిపారు. అయితే కేంద్రం శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన బులెటిన్లో తెలంగాణలో 984 కేసులు, 26 మరణాలను పేర్కొంది. 26వ వ్యక్తి మరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది.
ప్లాస్మా థెరపీకి పర్మిషన్ వచ్చింది
రాష్ట్రంలో కరోనా పేషెంట్లపై ప్లాస్మా థెరపీ ప్రయోగాలు చేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) అనుమతించిందని మంత్రి ఈటల వెల్లడించారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తో వీడియో కాన్ఫరెన్స్ లో ప్లాస్మా థెరపీకి పర్మిషన్ ఇస్తున్నట్టు చెప్పారన్నారు. సీరియస్ కండీషన్లో ఉన్న పేషెంట్లకు మాత్రమే ప్లాస్మా థెరపీ చేస్తారని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్, సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కంటెయిన్మెంట్ జోన్లలో ఒక్కరు కూడా బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఆ ఆరోపణలు సరికాదు
కొందరు నాయకులు, బాధ్యత గల వ్యక్తులు చిన్న చిన్న విషయాలను పట్టుకుని.. డాక్టర్లు, సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని మంత్రి ఈటల విమర్శించారు. కొందరు సైకోలు, శాడిస్టుల ఆలోచనలు వేరుగా ఉన్నాయని.. గాంధీ హాస్పిటల్లో సౌకర్యాలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీని పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్చామని చెప్పారు. అక్కడ ఆహారం సరిగా లేదంటూ పేషెంట్లలో ఎవరో ఒకరు రాసిన లేఖ ఆధారంగా విపక్షాలు, బాధ్యత గల వ్యక్తులు స్పందించడం సరికాదన్నారు. కరోనా పేషెంట్లకు చాలా మంచి భోజనం పెడుతున్నామని చెప్పారు. ఒక్క పేషెంట్ కూడా గాంధీలో సౌకర్యాలు సరిగా లేవని ఫిర్యాదు చేయలేదన్నారు. డాక్టర్లు, హెల్త్ సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. లక్ష మంది కరోనా రోగులు వచ్చినా సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. శుక్రవారం కేంద్రమంత్రి హర్షవర్ధన్తో వీడియో కాన్ఫరెన్స్ జరిగిందని, రాష్ట్రం కరోనాను అరికట్టడంలో బాగా కృషిచేస్తోందంటూ అభినందించారని ఈటల చెప్పారు. ప్రస్తుతం తొమ్మిది ల్యాబ్స్ ద్వారా రోజుకు 1,600 టెస్టులు చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉందని వివరించామన్నారు.
వైరస్ బారిన కుటుంబాలు
హోం క్వారంటైన్ నిబంధనలు పాటించకపోవడంతో కొన్నిచోట్ల కుటుంబం మొత్తం వైరస్ బారిన పడుతోందని ఈటల అన్నారు. ‘‘వికారాబాద్లో 14 కుటుంబాల్లోనే 38 మందికి వైరస్ సోకింది. సూర్యాపేటలో 25 కుటుంబాల్లో 83 మందికి, గ్రేటర్ హైదరాబాద్లో 44 కుటుంబాల్లో ఏకంగా 268 మందికి వైరస్ అంటుకుంది. గద్వాలలో 30 కుటుంబాలకు చెందిన 45 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది” అని చెప్పారు. కాగా.. 20 రోజులుగా హోం క్వారంటైన్లో ఉన్న తర్వాత ఓ వ్యక్తిలో కరోనా లక్షణాలు కనిపించడం నిర్మల్లో కలకలం రేపింది. ఢిల్లీ మర్కజ్కు వెళ్లొచ్చిన ఆ వ్యక్తికి రెండు సార్లు టెస్టులు చేసినా వైరస్ నెగిటివ్ వచ్చింది. మూడు రోజుల కింద వైరస్ లక్షణాలు కనిపించడంతో మళ్లీ టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులను క్వారంటైన్కు తరలించారు.