- ప్రతిపాదనలు పంపినా ఆమోదించని ఆర్థిక శాఖ
- అన్ని సొసైటీల్లో కలిపి 10 వేలకుపైగా ఖాళీలు
- చాలా గురుకులాల్లో భారీగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ స్టాఫ్
- టీజీటీ మినహా మిగతా పోస్టులు నింపాలంటున్న అభ్యర్థులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గురుకులాల్లో ఖాళీల భర్తీ ముందుకు పడడం లేదు. అన్ని వివరాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సొసైటీలు ప్రతిపాదనలు పంపినా సర్కారు ఆమోద ముద్ర వేయడం లేదు. నెలల తరబడి ఫైలు ఆర్థిక శాఖ వద్దే పెండింగ్లో ఉంది. అన్ని సొసైటీల పరిధిలో దాదాపు 10 వేలకు పైగా పోస్టుల ఖాళీలు ఉన్నాయి. ఏటా గురుకులాల్లో తరగుతులు అప్గ్రేడ్ అవుతుండటంతో సిబ్బంది సరిపోవడంలేదు. దీంతో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తో నెట్టుకొస్తున్నారు.
లక్షల విద్యార్థులు చదువుతున్నా నిర్లక్ష్యమే
రాష్ట్ర వ్యాప్తంగా 970 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలున్నాయి. ఇందులో సుమారు 2.7 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవల సర్కారు ప్రకటించిన 80 వేల పోస్టుల్లో గురుకులాల్లోని ఖాళీలు కూడా ఉన్నాయి. వీటిని గురుకులాల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. ఆయా సంక్షేమ శాఖల నుంచి ఖాళీల వివరాలన్నీ ఇప్పటికే ఆర్థిక శాఖకు చేరాయి. గతంలోనే బీసీ గురుకులాల పరిధిలో 3,500 పోస్టుల కోసం ప్రతిపాదనలు పంపించారు. అవి ఏండ్ల తరబడి ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఎస్సీ గురుకులంలో 3 వేల పోస్టులు, ఎస్టీ విభాగంగా 2 వేలు, మైనార్టీలో 1,500, జనరల్ గురుకులాల్లో 500 చొప్పున ప్రతిపాదించారు. ఇటీవల మొదటి విడతలో 30 వేల ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అప్రూవల్ ఇచ్చింది. కానీ అందులో అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్న గురుకులాల పోస్టుల ముచ్చట మాత్రం లేదు.
స్కూళ్లు అప్గ్రేడ్ అవుతున్నా పోస్టులు నింపట్లే.
గురుకులాల్లో ఏటా ఒక్కో తరగతి అప్గ్రేడ్ అవుతోంది. బీసీ గురుకులాల్లో 119 స్కూళ్లు గత ఏడాది జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ అయ్యాయి. ప్రస్తుతం వీటిల్లో ఇంటర్ ఫస్టియర్ కొనసాగుతోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సెకండియర్కు అప్గ్రేడ్ కానున్నాయి. దీంతో మరింత మంది స్టాఫ్ అవసరం. ఇప్పటికే అరకొరగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ స్టాఫ్తో చెప్పిస్తున్నారు. పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపితే 2022–23 విద్యాసంవత్సరం నుంచి కొత్త స్టాఫ్ అందుబాటులోకి వస్తుందని సొసైటీల అధికారులు భావించారు. కానీ ఆ దిశగా అడుగులు పడటంలేదు. గురుకులాల్లో పోస్టులు భర్తీని గురుకులాల రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధంగా ఉంది. గతంతో ఆయా పోస్టులను ఏ వివాదం లేకుండా నింపిన అనుభవం బోర్డుకు ఉంది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వస్తే పోస్టుల భర్తీకి రెడీగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు. ఫైలు ఆర్థిక శాఖ వద్ద ఎందుకు ఆగిందో తెలియదని అంటున్నారు.
టీజీటీ పోస్టులకే టెట్ అవసరం..
గురుకులాల్లో నింపాల్సిన 10 వేల పోస్టుల్లో ఒక్క టీజీటీ (ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్) పోస్టుల భర్తీకే టెట్ అవసరం ఉంది. టెట్ కోసం వీటి భర్తీని ఆపినా.. మిగతా పోస్టులన్నీ నింపొచ్చు. టీచింగ్ కేటగిరీలో పీజీటీ, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, స్కూల్, ఇంటర్, డిగ్రీ ప్రిన్సిపాల్స్, నాన్టీచింగ్ కేటగిరీలో జూనియర్ అసిస్టెంట్, లైబ్రేరియన్, ల్యాబ్ అసిస్టెంట్లు, నాన్టీచింగ్ కేటగిరీలో జూనియర్ అసిస్టెంట్, లైబ్రేరియన్, ట్యాబ్ అసిస్టెంట్లు తదితర ఖాళీలు ఉన్నాయి. వీటిని నింపేందుకు అడ్డంకులు ఏమున్నాయని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.