తీసేసిన సిలబస్ నుంచి క్వశ్చన్లు
ఆందోళనలో టీచర్లు, స్టూడెంట్స్
హైదరాబాద్, వెలుగు: రెండ్రోజుల కింద ఎస్సీఈఆర్టీ వెబ్ సైట్లో పెట్టిన టెన్త్ మోడల్ పేపర్లలో.. తొలగించిన సిలబస్ లోంచి క్వశ్చన్లు ఇవ్వడంతో స్టూడెంట్లు, టీచర్లలో అయోమయం నెలకొన్నది. కరోనా ఎఫెక్టుతో ఈ ఏడాది టెన్త్ లో 30% సిలబస్ తగ్గించిన సర్కారు.. 70% సిలబస్ నుంచే ఎగ్జామ్స్లో క్వశ్చన్లు వస్తాయని చెప్పింది. పేపర్లను కూడా 11 నుంచి ఆరుకు కుదించింది. 80 మార్కులతో కూడిన పేపర్ ఉంటుందని పేర్కొంది. విద్యాశాఖ అధికారులు శనివారం టెన్త్ మోడల్ పేపర్లను ఎస్సీఈఆర్టీ వెబ్ సైట్లో పెట్టారు. ఈ పేపర్లలో తొలగించిన సిలబస్ నుంచి ప్రశ్నలు రావడం చూసి టీచర్లు ఆందోళన చెందుతున్నారు. తెలుగు సబ్జెక్టులో పద్యభాగం, గద్యభాగం, ఉపవాచకం ఉండగా.. వీటిలో కొన్ని చాప్టర్లను సిలబస్ నుంచి తగ్గించారు. మోడల్ పేపర్లో మాత్రం తీసేసిన పాఠాల్లోంచే క్వశ్చన్లను పెట్టారు. మ్యాథ్స్ సబ్జెక్టులోనూ ఇలాంటి అయోమయమే నెలకొన్నది. పార్ట్–ఎ లో 15, పార్ట్–బి లో 4,15,19 క్వశ్చన్లు తీసేసిన సిలబస్ నుంచే పెట్టారు. అన్ని సబ్జెక్టుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని టీచర్లు చెప్తున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.