కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇందిరాశోభన్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట అత్యాచారాలు జరగడానికి కారణం ప్రభుత్వం లిక్కర్ను అదుపు చేయకపోవడమేనని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ ఆరోపించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. మద్యం నియంత్రణకు ప్రభుత్వం దశలవారీగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బెల్టుషాపులే లేవని ప్రభుత్వం చెబుతోందని, కానీ ఇల్లీగల్ కేసులు ఎన్ని బుక్ అయ్యాయని ఆర్టీఐ కింద దరఖాస్తు చేస్తే 22 జిల్లాల్లో 17,952 కేసులు నమోదైనట్లు అధికారులు సమాచారం ఇచ్చారని చెప్పారు. వికారాబాద్ జిల్లా పరిగి ఎస్హెచ్వో కింద 8,233 కేసులు నమోదైనట్లు తెలిపారు. మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తుండటంతో రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయన్నారు. రహదారులకు 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండాలని, 100 మీటర్ల దూరంలోనే ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని చెప్పారు.