హైదరాబాద్,వెలుగు: ఫేక్ ఫేస్బుక్ ఐడీతో యువతను ట్రాప్ చేస్తున్న దంపతులను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ వివరాలు వెల్లడించారు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ఎర్రగుడ్ల దాసు నూజివీడు ఐఐఐటీలో బీటెక్ చదివాడు. 2014లో కొండాపూర్లోని టీసీఎస్ కంపనీలో జాయిన్ అయ్యాడు. ఖాళీగా ఉన్న సమయాల్లో ఆన్లైన్ రమ్మీ ఆడేవాడు. 6 నెలల తర్వాత జాబ్ పోయింది. ఆన్లైన్ రమ్మీ, కార్డ్స్ ఆడేందుకు ఫ్రెండ్స్,బంధువుల దగ్గర అప్పులు చేశాడు. హైదరాబాద్ నుంచి సొంతూరికి వెళ్లిపోయాడు. 2017లో జ్యోతి అనే యువతిని పెండ్లి చేసుకున్నాడు. 2019లో దంపతులు ఇద్దరు సత్తెనపల్లికి షిఫ్ట్ అయ్యారు. అక్కడ దాసు ఫ్రూట్ వెండర్గా పనిచేశాడు. వచ్చిన డబ్బుతో ఆన్ లైన్ రమ్మీ ఆడేవాడు.
ఆన్లైన్ రమ్మీ బ్యాన్ కావడంతో క్రికెట్ బెట్టింగ్ పెట్టేవాడు. బెట్టింగ్ ల కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. ‘కళ్యాణి శ్రీ’పేరుతో ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి యువతను ట్రాప్ చేసేందుకు స్కేచ్ వేశాడు. గతేడాది మేలో సికింద్రాబాద్కు చెందిన విజయ్ రెడ్డిని ట్రాప్ చేశాడు.పెండ్లి చేసుకుంటానని ఏడాది పాటు అమ్మాయి లాగా చాట్ చేశాడు.ల్యాండ్ సెటిల్మెంట్ కోసం డబ్బులు కావాలని రిక్వెస్ట్ చేసి గతేడాది మే నుంచి విజయ్ రెడ్డి దగ్గరి నుంచి సుమారు రూ.కోటి క్యాష్ను దాసు తన భార్య జ్యోతి అకౌంట్కి ట్రాన్స్ ఫర్ అయ్యేలా చేశాడు. ఆ డబ్బుతో దాసు దంపతులు సత్తెనపల్లిలో ల్యాండ్ కొన్నారు. వీరి చేతిలో మోసపోయిన విజయ్రెడ్డి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ నెల 12న కంప్లయింట్చేశాడు. ఇన్స్స్పెక్టర్ జి.వెంకట్రెడ్డి ఆధ్వర్యంలోని టీమ్ కేసు దర్యాప్తు చేసింది.బ్యాంక్ అకౌంట్స్,ఐపీ అడ్రెస్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసింది.