వింటర్ ఒలింపిక్స్ కోసం స్పెషల్గా తయారు చేసిన చైనా
గంటకు 350 కిలోమీటర్ల వేగం.. 3 గంటల జర్నీ 47 నిమిషాలకు కుదింపు
బుల్లెట్ రైలు అనగానే గుర్తొచ్చేది జపాన్, చైనాలే. అయితే, ఇప్పుడు చైనా ఇంకో అడుగు ముందుకేసింది. డ్రైవర్లెస్ కార్లలాగే డ్రైవర్ అవసరం లేని బుల్లెట్ రైలును తయారు చేసింది. తయారు చేయడమే కాదు, పట్టాలపైకి ఎక్కించి పరుగులు పెట్టించింది. 2022 బీజింగ్ ఒలింపిక్స్కు కౌంట్డౌన్ కొనసాగుతున్న టైంలోనే చైనా ఈ రైలును ప్రారంభించింది. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ బుల్లెట్ ట్రెయిన్, డ్రాగన్ కంట్రీ రాజధాని బీజింగ్ నుంచి ఒలింపిక్స్ జరిగే ఝాంగ్జియాకు సిటీకి పరుగులు పెడుతుంది. ఇప్పటిదాకా ఆ రెండు సిటీల మధ్య ప్రయాణ దూరం 3 గంటలు కాగా, ఈ బుల్లెట్ రైలులో కేవలం 47 నిమిషాల్లోనే చేరుకోవచ్చట. డ్రైవర్ లేని బుల్లెట్ రైళ్లలో ఇదే ఫస్ట్ అని చెబుతున్నారు. జింగ్ఝాంగ్ హై స్పీడ్ రైల్వేస్లో భాగంగా ఈ రైలును, రైల్వే లైన్ను రెడీ చేశారు.
దానికి దాదాపు నాలుగేళ్లు పట్టిందట. బీజింగ్, యాంఖింగ్, ఝాంగ్జియాకు రూట్లలో తిరుగుతుంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉండే బదాలాంగ్ చాంగ్షెంగ్ ప్రాంతం సహా 10 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందట. డిసెంబర్ 30నే దీని సర్వీస్ ప్రారంభమైంది. బీజింగ్ నార్త్రైల్వే స్టేషన్ నుంచి తైజీషెంగ్ రైల్వేస్టేషన్కు ఫస్ట్ ట్రిప్పు వెళ్లింది. దీంట్లో టికెట్లు కావాలంటే రెండు రోజుల ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుందట. ఈ ట్రైన్లో 5జీ సిగ్నల్స్, అవసరానికి తగ్గట్టు వెలిగే లైట్లు, రియల్టైం డేటా తీసుకునేందుకు, రైల్లో లోపాలను గుర్తించేందుకు 2,718 సెన్సర్లు ఉన్నాయి. అందుకే దీన్ని స్మార్ట్ ట్రైన్గా పిలుస్తున్నారు. అంతేగాకుండా ప్రతి స్క్రీన్కూ ఓ టచ్స్క్రీన్ కంట్రోల్ ప్యానెల్తో పాటు వైర్లెస్ చార్జింగ్ డాక్లు దీని స్పెషాలిటీ. తనంతట తానే దూసుకెళ్లే ఈ ట్రైన్లో, దాని గమనాన్ని పరిశీలించేందుకు మాత్రం స్పెషల్గా ఓ డ్రైవర్ ఉంటాడు. స్టేషన్లలో స్టార్ట్ కావడానికిగానీ, ఆగడానికి డ్రైవర్ అవసరం లేదు. దానంతట అదే చూసుకుంటుంది. అంతేగాకుండా స్టేషన్ల మధ్య స్పీడ్లనూ అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. పేపర్లెస్ చెకిన్స్ కోసం రోబోలు, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీలను వివిధ రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేశారు.
ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకుని…
వింటర్ ఒలింపిక్స్ కోసం స్పెషల్గా ఈ ట్రైన్ను తయారు చేశారు కాబట్టి, ఆటగాళ్లు, జర్నలిస్టులను దృష్టిలో పెట్టుకుని రైలు పెట్టెలను తయారు చేశారు. వాళ్ల సామాన్లకు తగ్గట్టు స్టోరేజీ స్పేస్ ఇచ్చారు. అయితే, స్పేస్ను తీసుకోవాలంటే మాత్రం క్యూఆర్ కోడ్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. మామూలు టైంలో డైనింగ్ కోసం వాడే రైలు బోగిని, ఒలింపిక్స్ టైంలో మీడియా సెంటర్గా మారుస్తారు. అక్కడి నుంచే లైవ్ కవరేజీ ఇవ్చొచ్చట. వీల్చైర్లలో వచ్చే దివ్యాంగుల కోసం సీట్లను తొలగించేలా ‘కార్ ఫోర్’ను ఏర్పాటు చేశారు.