- అడ్డుకున్న పోలీసులు.. ఏడుగురు రైతులపై ఫిర్యాదు
కొత్తగూడ, వెలుగు: మహబూబాబాద్జిల్లా గంగారం మండలం మడగూడలో మంగళవారం ఫారెస్ట్ఆఫీసర్లు, పోడు రైతుల మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. డిప్యూటీ రేంజ్ఆఫీసర్(డీఆర్వో)పై పోడు రైతులు దాడి చేశారు. మడగూడలోని 836 కంపార్ట్మెంట్లోని 20 హెక్టార్లలో రెండు నెలల క్రితం ఫారెస్ట్ ఆఫీసర్లు ట్రెంచ్కొట్టారు. ఈ క్రమంలో ఆ భూమిలో మొక్కలు నాటేందుకు రేంజర్చలపతిరావు, డీఆర్వో కరుణానాయక్తోపాటు మరికొందరు ఫారెస్ట్ సిబ్బంది పోలీసులతో అక్కడకు చేరుకున్నారు. ట్రాక్టర్లతో చదును పనులు చేపట్టారు. గతంలో ఆ భూమిలో పోడు చేసిన ఆదివాసీ రైతులు కొందరు అక్కడికి చేరుకొని ఫారెస్ట్ఆఫీసర్లను పనులు ఆపాలని వేడుకున్నారు. ఫారెస్ట్ఆఫీసర్లు వినిపించుకోకపోవడంతో భూములు పోతున్నాయనే కోపంతో ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్కరుణానాయక్ పై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. రైతులను పోలీసులు అడ్డుకుని స్టేషన్కు తరలించారు. డీఆర్వో ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఇన్చార్జి ఎస్సై సురేష్ చెప్పారు.
ముక్కిడిగుండంలోనూ ఉద్రిక్తత
నాగర్కర్నూల్జిల్లా కొల్లాపూర్మండలం ముక్కిడిగుండం గ్రామ సరిహద్దుల్లోని పొలాల్లో విత్తనాలు నాటేందుకు వెళ్లిన గిరిజన కుటుంబాలను ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకున్నారు. ముక్కిడిగుండం గ్రామానికి చెందిన 20 గిరిజన కుటుంబాలు దాదాపు 30 ఏళ్లుగా 20 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నాయి. నాలుగేళ్ల క్రితం ఫారెస్టు ఆఫీసర్లు దాదాపు20 మంది గిరిజనులపై కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది వర్షాలతో అదను కాగానే 20 ఎకరాల భూమిని దున్నిన 20 గిరిజన కుటుంబాలు మంగళవారం విత్తనాలు వేసేందుకు వెళ్లారు. అటవీ భూముల్లో సాగు చేయడానికి వీల్లేదని అడ్డు చెప్పడంతో గిరిజన కుటుంబాలు, ఫారెస్ట్ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ ప్రాణాలు ఈ మట్టిలోనే పోవాలంటూ గిరిజన మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఫారెస్ట్ సిబ్బంది వెనుదిరిగారు. దాంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది. సర్కారు భూములు అమ్ముకుని బిజినెస్ చేయొచ్చు కానీ ఆదివాసీలు, గిరిజనులు భూములను నమ్ముకోవద్దా అని తెలంగాణ గిరిజన సమాఖ్య కార్యదర్శి అశోక్ ప్రశ్నించారు. పోడు భూముల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.