వరద బాధితులకిచ్చే సాయం అధికార పార్టీకి చెందిన కార్యకర్తలకే అందుతున్నాయని.. తమలాంటి అసలైన బాధితులకు సాయం చేరడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నగరవాసులు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం లోని సీతాఫల్ మండి డివిజన్, తార్నాక డివిజన్, బౌద్ధ నగర్ డివిజన్, మెట్టుగూడ డివిజన్, అడ్డగుట్ట డివిజన్ ప్రజలు.. నష్టపరిహారం వరద బాధితులకు కాకుండా టిఆర్ఎస్ నాయకులే దోచుకున్నారని ఆరోపించారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పద్మారావు ఆఫీసును ముట్టడించారు.
అంబర్పేటలో కూడా వరద బాధితుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఇంటి ముందు పెద్ద సంఖ్యలో మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ నిరసన చేపడుతున్నప్పుడే గోల్నాకకు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు
వరద సాయం అందడం లేదని ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికార పార్టీ నేతలు వివక్ష చూపెడుతున్నారని మండిపడ్డారు. రోడ్డుపై నిరసనకు దిగారు. ఉప్పల్లో నిరసన చేపట్టిన వరద బాధితులకు ఉప్పల్ కార్పొరేటర్ భర్త హనుమంత్రెడ్డి మద్దతు తెలిపారు.