నల్గొండ టౌన్, వెలుగు: ముగ్గురు బాలికలను రేప్ చేసి చంపేసిన మర్రి శ్రీనివాస్రెడ్డికి ఉరిశిక్ష విధించాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చంద్రశేఖర్ కోర్టును కోరారు. మంగళవారం నల్గొండలోని పోక్సో స్పెషల్ కోర్టులో జరిగిన విచారణలో ప్రాసిక్యూషన్ తరఫున ఆయన వాదనలు వినిపించారు. శ్రీనివాస్రెడ్డికి వ్యతిరేకంగా 101 సాక్ష్యాలున్నాయని, మూడు కేసులను అసాధారణమైనవిగా గుర్తించి నిందితుడికి ఉరిశిక్ష విధించాలన్నారు.
ఆయన వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం డిఫెన్స్ తరఫున వాదనలు పూర్తయిన తర్వాత శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది. కాగా, శ్రీనివాస్రెడ్డికి వెంటనే ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ లాయర్లు కోర్టు ఆవరణలో ఆందోళన చేశారు.