- ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
హైదరాబాద్, వెలుగు: దేశంలో ఆరోగ్య సంరక్షణ విషయంలో ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించి, ప్రతి ఒక్కరికీ హెల్త్ సర్వీస్ అందుబాటులోకి తేవాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. బుధవారం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలోని ఉన్నతమైన వృత్తుల్లో వైద్య వృత్తి ఒకటని, డాక్టర్లు తమ వద్దకు వచ్చే రోగుల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని, సానుభూతితో ట్రీట్మెంట్ అందించాలన్నారు. ఎలాంటి రోగాన్ని అయినా నివారించేందుకు మంచి ఆరోగ్యం, దారుఢ్యం అవసరమనే విషయాన్ని కరోనా మహమ్మారి గుర్తు చేసిందని తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు టీమ్ ఇండియా స్ఫూర్తితో పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి వెంటనే టెస్టులు చేయడంలోనూ, అన్ని రకాల రోగాలను ముందస్తుగా గుర్తించడంలోనూ డయాగ్నస్టిక్ ల్యాబ్ల పాత్ర ఎంతో ఉందన్నారు. గ్రామాల్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరముందని, ఈ విషయంలో ప్రభుత్వాలకు ప్రైవేట్ రంగం సహకరించాలన్నారు. టెలీ మెడిసిన్ సౌకర్యాలను గ్రామాలకు అందించడంలో, సాంకేతిక– టెలీ కమ్యూనికేషన్ రంగాలను సంపూర్ణంగా వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రి తలసాని, చిరంజీవి పాల్గొన్నారు.