హడావుడి చేసి వదిలేసిన హయ్యర్ ఎడ్యుకేషన్
ఇప్పటికే సిటీలోని 9 కాలేజీలను ఎంపిక చేసిన ఆఫీసర్లు
ఆశగా ఎదురుచూస్తున్న ఆయా కాలేజీల స్టూడెంట్లు
హైదరాబాద్, వెలుగు:
రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో క్వాలిటీ పెంచేందుకు క్లస్టర్ విధానం తీసుకొస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా ఇంతవరకు అమల్లోకి తేలేదు. పైలట్ ప్రాజెక్టు కింద 9 కాలేజీలను ఎంపిక చేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు విధివిధానాలు ప్రకటించలేదు. దీంతో ఈ విధానం అమలవుతుందో లేదోనన్న అనుమానం కలుగుతోంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఈ ఏడాది నుంచి డిగ్రీలో క్లస్టర్ విధానం అమలు చేయాలని 6 నెలల క్రితం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్లోని 9 అటానమస్ కాలేజీలను ఎంచుకుంది. 2021–22 అకడమిక్ ఇయర్లో డిగ్రీ సెకండియర్ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది.
కాలేజీల మధ్య ఎంఓయూ..
హైదరాబాద్లోని నిజాం కాలేజీ, కోఠి ఉమెన్స్ కాలేజీ, సిటీ కాలేజీ, బేగంపేట ఉమెన్స్, రెడ్డి ఉమెన్స్, సెయింట్ఆన్స్ కాలేజీ (మెహిదీపట్నం), సెయింట్ఫ్రాన్సిస్(బేగంపేట), భవన్స్ కాలేజీ, లయోలా అకాడమీ కాలేజీలను ఓ క్లస్టర్గా ఏర్పాటు చేశారు. వీటిలోని కాలేజీలు పరస్పరం ఎంఓయూ కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఆయా కాలేజీల స్టూడెంట్లు ఎంచుకున్న సబ్జెక్టు క్లాసులను ఇతర కాలేజీలో వినే అవకాశముంటుంది. ఫ్యాకల్టీ, ల్యాబ్స్, లైబ్రరీ, గ్రౌండ్, క్లాస్ రూమ్స్ఇలా ఆయా కాలేజీల్లోని ఫెసిలిటీస్ను ఎంఓయూ చేసుకున్న మరో కాలేజీ యూజ్ చేసుకునే చాన్స్ కూడా ఉంటుంది. అయితే ఇప్పటికీ ఏయే కాలేజీలు ఎంఓయూ చేసుకున్నాయి, ఏయే గ్రూపులను ఎంచుకున్నాయనే వివరాలు బయటకు రాలేదు. ముందు ఈ ప్రాజెక్ట్పై చాలాసార్లు ఆఫీసర్లతో మీటింగ్పెట్టి హడావుడి చేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తర్వాత పట్టించుకోలేదనే
విమర్శలు వినిపిస్తున్నాయి. క్లస్టర్ విధానం అమలుకు గైడ్లైన్స్ కోసం కమిటీ కూడా వేశారు. అయినా ఇప్పటికీ అధికారికంగా వాటిని రిలీజ్ చేయలేదు. దీంతో ఆయా కాలేజీల్లో చదవాలనుకునే స్టూడెంట్లకు 6 నెలలుగా ఎదురుచూపులు తప్పట్లేదు. ఉన్నతాధికారులు దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
నెలాఖరులో ప్రారంభిస్తం..
డిగ్రీలో క్లస్టర్ విధానం అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించాం. గైడ్లైన్స్ రెడీ చేసి, ఎంపిక చేసిన 9 కాలేజీలకు వాటిని అందజేశాం. ఈ నెలాఖరులో క్లస్టర్ విధానాన్ని అధికారికంగా ప్రారంభిస్తం. దీనివల్ల ఎడ్యుకేషన్లో క్వాలిటీ పెరిగే అవకాశముంది.- ప్రొఫెసర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్