భూ వివాదం.. పోలీసుల అదుపులో మాజీ మంత్రి మల్లారెడ్డి

భూ వివాదం.. పోలీసుల అదుపులో మాజీ మంత్రి  మల్లారెడ్డి

కుత్బుల్లాపూర్:  భూవివాదం కేసులో  మాజీ మంత్రి మల్లారెడ్డిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  సుచిత్రలోని ల్యాండ్ వివాదం కేసులో పోలీసులతో వాగ్వాదానికి దిగారు మల్లారెడ్డి. దీంతో మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని పేట్ బషీరాబాద్ పీఎస్ కు తరలించారు. 

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా  సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో  మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలం కొర్టు వివాదంలో ఉంది. ఈ క్రమంలోనే ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, తమ అనుచరులతో కలిసి స్థలంలో వేసిన భారీ కేడ్లను తొలగించారు.అక్కడున్న రెండున్నర ఎకరాల భూమి తనదే అంటూ వాగ్వాదానికి దిగారు. 

అయితే అందులో  1.06 గుంటల భూమి తమదంటూ మరో 15 మంది అడ్డుకున్నారు. ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని 15 మంది చెప్తున్నారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మల్లారెడ్డి తన అనుచరులతో బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. పోలీసులు ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

  కోర్టు ఆర్డర్ ఉన్నందున సంఘటన స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరువర్గాలకు సర్ది చెప్పారు పోలీసులు. ఈ క్రమంలోనే మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ  ఉద్రిక్తత నెలకొంది. అయితే పోలీసులు ఎంత చెప్పినా మల్లారెడ్డి ,రాజశేఖర్ రెడ్డి వినలేదు. దీంతో మల్లారెడ్డిని  అదుపులోకి తీసుకుని పేట్ బషీరాబాద్ పీఎస్ కు తరలించారు పోలీసులు.  మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి స్థలం దగ్గరే ఉన్నారు.