హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్గా సీవీ ఆనంద్ శనివారం మధ్యాహ్నం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక్కడే చదువుకుని, పెరిగి మళ్లీ హైదరాబాద్కు సీపీగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పోస్టింగ్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పారు. దేశంలోనే చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీ హైదరాబాద్ అని, శాంతిభద్రతలు సజావుగా ఉంటేనే అభివృద్ధి సాగుతుందని ఆయన అన్నారు.
సైబర్ క్రైమ్స్కు చెక్ పెట్టేందుకు ప్రత్యేక నిఘా
మత సామరస్యానికి పేరైన హైదరాబాద్లో గతంలోనూ తాను అనేక బాధ్యతలు నిర్వర్తించానని, శాంతిభద్రతలు కాపాడడమే తన ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పారు. ప్రస్తుతం శాంతిభద్రతలు మంచిగా ఉన్నాయని, దీనిని కొనసాగేలా చూస్తామని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి సమావేశంలో కేసీఆర్ శాంతిభద్రతలపైనే మొదటి సమావేశం నిర్వహించారని అన్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ పెట్టారన్నారు. సీసీ టీవీ విజిలెన్స్, సాంకేతికత సాయంతో క్రైమ్స్కు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. డ్రగ్స్ దందాలను చెక్ పెట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. సైబర్ క్రైమ్ నియంత్రించేందకు ప్రత్యేక నిఘా పెడుతామని సీవీ ఆనంద్ చెప్పారు.
కాగా, రాష్ట్రంలో భారీగా ఐపీఎస్లు, నాన్కేడర్ ఆఫీసర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. సీఎస్ సోమేశ్ కుమార్ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ అపాయింట్ అయ్యారు. ఇక్కడ సీపీగా ఉన్న అంజనీ కుమార్.. ఏసీబీ డీజీపీగా ట్రాన్స్ఫర్ అయ్యారు. సెంట్రల్ సర్వీస్లో ఉన్న సీవీ ఆనంద్ ఈ మధ్యే రాష్ట్ర సర్వీసుకు రిపోర్ట్ చేశారు. అందులో భాగంగానే ఆయనకు పోస్టింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఈయన సైబరాబాద్ సీపీగా, సివిల్ సప్లయ్స్ కమిషనర్గా పనిచేశారు.