శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్, షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్టులను సెక్యూరిటీ ఫోర్సెస్ మట్టుపెట్టాయి. చనిపోయిన వారిలో ఇద్దరు హై ర్యాంకింగ్ కమాండర్స్ ఉండటం గమనార్హం. షోపియాన్ జిల్లాలోని పింజోరా ఏరియాలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. గత 24 గంటల్లో షోపియాన్ డిస్ట్రిక్ట్లో జరిపిన ఎన్కౌంటర్స్లో మొత్తం 9 మంది హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
పింజోరాలో ఆర్మీ, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) యూనిట్స్ కలసి సోమవారం ఉదయం ఈ ఎన్కౌంటర్ చేశాయి. ఈ సమయంలో షోపియాన్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతోపాటు ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశించారు. ఆదివారం 5 మంది హిజ్బుల్ ముజాహిదీన్ మిలిటెంట్స్ను షోపియాన్ జిల్లాలోని రెబాన్ ప్రాంతంలో సెక్యూరిటీ ఫోర్సెస్ చంపేశాయి. మృతుల్లో హిజ్బుల్ టాప్ కమాండర్ ఉండటం గమనార్హం. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో తొలుత భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహించగా.. ఆ ఏరియాలో దాక్కుని ఉన్న టెర్రరిస్టులు ఫైరింగ్కు దిగారు. దీంతో సెక్యూరిటీ ఫోర్సెస్ ఎదురు కాల్పులు చేశారు.