
సిమ్లా : ప్రధాని నరేంద్ర మోదీ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలా హిందీ రాని ఇటాలియన్ కాదని సినీ నటి, మండి లోక్సభ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ అన్నారు. దేశాభివృద్ధికి పాటుపడుతున్న ఈ నేల బిడ్డ అని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం హిమాచల్ప్రదేశ్లోని కులు జిల్లా జగత్ఖానాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు. మోదీ సుపరిపాలనకు ప్రతీక అని, ప్రధానికి పహారీతో సహా పలు భాషలు తెలుసని అన్నారు. పేద కుటుంబంలో పుట్టి దేశ సంక్షేమం, అభివృద్ధికి పాటుపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఓ వైపు మోదీ సుపరిపాలన, మరోవైపు కాంగ్రెస్ అవినీతి కనిపిస్తుండడంతో హిమాచల్ ప్రదేశ్ ప్రజలు జూన్1న జరిగే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని నిర్ణయించుకున్నారని ఆమె తెలిపారు.