వేలి ముద్ర వేస్తేనే గ్యాస్ బండ డెలివరీ : ఇంట్లో నుంచే e -KYC అప్ డేట్ చేసుకోండి కస్టమర్లూ..!

వేలి ముద్ర వేస్తేనే గ్యాస్ బండ డెలివరీ : ఇంట్లో నుంచే e -KYC అప్ డేట్ చేసుకోండి కస్టమర్లూ..!

కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ గ్యాస్ వినియోగదారుల కోసం ఒక కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న డొమెస్టిక్ ఎల్‌పీజీ కస్టమర్లందరూ తప్పనిసరిగా e-KYC పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అయితే దీని కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. వినియోగదారులు తమ ఇంట్లోనే ఉండి మొబైల్ ఫోన్ ద్వారా దీనిని పూర్తి చేయవచ్చు. గ్యాస్ కనెక్షన్ సంస్థకు చెందిన మొబైల్ యాప్, 'Aadhaar FaceRD' యాప్ ఉపయోగించి ఈ-కేవైసీ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాల కోసం కంపెనీ వెబ్‌సైట్ లేదా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించవచ్చు.

పశ్చిమాసియా సంక్షోభం భారత్‌లో గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూతపడటంతో భారత్ దిగుమతి చేసుకునే ఎల్‌పీజీలో 90 శాతం నిలిచిపోయింది. దీనివల్ల దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడవచ్చనే ఆందోళనతో చాలా చోట్ల ప్రజలు పానిక్ బయింగ్ అంటే అవసరం లేకున్నా ముందుగానే కొని ఉంచుకోవడం చేస్తున్నారు. దీనివల్ల కృత్రిమ కొరత ఏర్పడి, నిజంగా అవసరం ఉన్నవారికి సిలిండర్లు దొరకని పరిస్థితి కొనసాగుతోంది. 

ఈ గ్యాస్ సెగ గృహ వినియోగదారుల కంటే హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న స్ట్రీట్ వ్యాపారులపై ఎక్కువగా పడుతోంది. వ్యాపార అవసరాల కోసం వాడే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ల సరఫరా తగ్గడంతో హోటల్ యజమానులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతున్నారు. భారీ ఓవెన్లు, గ్రిల్స్, హై-స్పీడ్ కుకింగ్ లైన్ల కోసం పూర్తిగా గ్యాస్ మీద ఆధారపడే పెద్ద రెస్టారెంట్ చైన్‌లు తమ సామర్థ్యాన్ని తగ్గించుకోగా.. చిన్న చిన్న టిఫిన్ షాపులు ఇప్పటికే మూతపడుతున్నాయి.

అందుకే ప్రభుత్వం ఈ-కేవైసీ ద్వారా అసలైన లబ్ధిదారులను గుర్తించి, దుర్వినియోగాన్ని అరికట్టాలని చూస్తోంది. అదే సమయంలో గ్యాస్ కొరత సమస్యను పరిష్కరించడానికి దౌత్యపరమైన చర్యలు చేపడుతోంది. వినియోగదారులు ఆందోళన చెందకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ-కేవైసీ పూర్తి చేస్తూనే.. గ్యాస్‌ను పొదుపుగా వాడుకోవడం ప్రస్తుతం అత్యవసరం. సప్లై మళ్లీ గాడిలో పడే వరకు డిజిటల్ పద్ధతుల్లో బుకింగ్ స్టేటస్ ట్రాక్ చేసుకోవటం బెటర్.