కల్లు దుకాణాల నుంచే.. ప్రతి నెలా రూ.3 లక్షల మామూళ్లు.. డైరీలో రాసుకున్న అబ్కారీ సీఐ

కల్లు దుకాణాల నుంచే.. ప్రతి నెలా రూ.3 లక్షల మామూళ్లు.. డైరీలో రాసుకున్న అబ్కారీ సీఐ
  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల పట్టుబడ్డ ఈఎస్ మల్లారెడ్డి
  • ఇప్పుడు సీఐ డైరీ బయటకు రావడంతో ఎక్సైజ్​ శాఖలో దుమారం

నిజామాబాద్, వెలుగు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్​సూపరింటెండెంట్ కొమ్ము మల్లారెడ్డి ఏసీబీకి పట్టుబడిన వెంటనే జిల్లాకు చెందిన ఎక్సైజ్​సీఐ మామూళ్ల చిట్టా రాసుకున్న డైరీ బయటపడడం సంచలనంగా మారింది. కల్లు దుకాణాల నుంచి నెలకు దాదాపు రూ.3 లక్షలు వసూలు చేస్తున్న ఆ సీఐ ఎవరి నుంచి ఎంత వసూలు చేశారో డైరీలో క్లియర్​గా రాసుకున్నారు. వారి నుంచి ఇంకా ఎంత ఎక్కువ వసూలు చేయాలో కూడా అందులో నోట్​చేసుకున్నారు.

సీఐ డైరీలో రహస్యంగా దాచుకున్న చిట్టా ఆ శాఖ ఉద్యోగి సోషల్​మీడియాలో పోస్ట్ చేయగా... అది వైరల్​గా మారింది. కల్లు దుకాణాల నుంచే నెలకు రూ. లక్షలు వసూలు చేసిన అధికారి బార్లు, వైన్స్​లు, బెల్ట్​షాప్ ల నుంచి ఇంకెంత వసూలు చేశారన్న చర్చ జరుగుతోంది. నిజామాబాద్​జిల్లాలో 102 వైన్స్, 19 బార్లు ఉండగా అమ్మకాలను పెంచేందుకు ఎక్సైజ్​అధికారులే వైన్స్​ ఓనర్లను ఒప్పించి బెల్ట్​షాపులను ఎంకరేజ్​ చేస్తున్నారు.

పర్మిట్​రూమ్​ల నుంచి నెలకు రూ.25 వేలు, బెల్ట్ షాప్​ నుంచి రూ.5 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. బార్​ ఓనర్ల నుంచి కూడా నెలకు రూ.25 వేల నుంచి రూ.40 వేలు తీసుకుంటున్నారు. కల్లు వ్యాపారుల నుంచి లంచాలు దండుకుంటున్న అధికారులు కల్తీ కల్లు దందాకు సహకరిస్తున్నారు. ఒక్కో షాప్​నుంచి నెలకు రూ.20 వేలు తీసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి.

జిల్లాలో ఏడుగురు ఎక్సైజ్​సీఐలు, 17 మంది ఎస్​ఐలు, సూపరింటెండెంట్, డిప్యూటీ కమిషనర్​ ఉన్నారు. సర్కిల్​ పరిధిలోని ఎస్​ఐ, సీఐలు వసూలు చేసిన మామూళ్లలో మూడు ‌‌‌‌‌‌‌‌శాతం పైఅధికారులకు,  కానిస్టేబుళ్లకు 20 శాతం పంచి మిగతా అమౌంట్ సీఐ, ఎస్​ఐలు పంచుకుంటున్నట్లు తెలుస్తున్నది. జిల్లాలో ప్రతి నెలా రూ.కోటి వరకు మామూళ్ల దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది.