తిరుపతి: తిరుపతి పాస్ పోర్ట్ కార్యాలయంలో సర్వర్లు పనిచేయక ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. సోమవారం సాయంత్రం నుంచి ఇదే పరిస్థితి. సర్వర్ పని చేయకపోవడంతో పాస్ పోర్టు పని మీద దూర ప్రాంతాల నుంచి వెళ్లిన ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై ప్రజల అసహనం వ్యక్తం చేశారు. కార్యాలయంలో కనీస వసతులు కల్పించక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
చేసేదేమీ లేక ఎండలోనే కూర్చుని ఎదురుచూస్తున్నారు. ప్రజలు పడుతున్న తిప్పలను ఫోటోలు, వీడియోలు తీస్తుంటే తీయొద్దని సెక్యూరిటీ గార్డు హుకుం జారీ చేశారు. పాస్ పోర్ట్ అధికారులపై ప్రజలు మండిపడుతున్నారు. కనీస మౌలిక వసతులైన మంచినీరు, సరిపడా కుర్చీలు, వాష్ రూమ్లు లేకపోవడంతో గంటల తరబడి వేచి చూడడం పాస్ పోర్టు పని మీద వెళ్లిన ప్రజలకు భారంగా మారింది.
విదేశాలకు వెళ్లాలంటే పాస్పోర్ట్ తప్పనిసరి. ఆ పాస్పోర్ట్ ఉంటేనే వీసాలు మంజూరు చేస్తాయి ఆయా దేశాలు. విదేశాల్లో అడుగుపెట్టాలంటే కావాల్సిన ఈ పాస్పోర్ట్ కొన్ని సందర్భాల్లో ఐడెంటిటీ ప్రూఫ్గా పనికొస్తుంది కూడా. పాస్పోర్ట్తో పాటు వీసా కూడా ఉంటే విదేశాలను చుట్టి రావచ్చు. ఈ వీసాలు కూడా రకరకాలుగా ఉంటాయి. వాటిలో ఎంట్రీ వీసాతోపాటు టూరిస్ట్, బిజినెస్, ఎంప్లాయిమెంట్, స్టూడెంట్, ట్రాన్సిట్, మెడికల్, కాన్ఫరెన్స్ వంటి రకరకాల వీసాలు ఉంటాయి.
