ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీలకు బ్రేక్ పడుతుందా? అసలు ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తోంది?

ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీలకు బ్రేక్ పడుతుందా? అసలు ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తోంది?

నగరాల్లో ప్రయాణాలకు బైక్ ట్యాక్సీలు కీలకంగా మారుతున్న వేళ కర్ణాటకలో మాత్రం వాటి చట్టబద్ధతపై వివాదం కొనసాగుతోంది. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నడుస్తున్న బైక్ ట్యాక్సీలపై కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జనవరి 23న కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. బైక్‌లను ప్యాసింజర్ ట్యాక్సీలుగా నడపడానికి ముందుగా సేఫ్టీ, ఇన్సూరెన్స్, అనుమతులు, ఆపరేషనల్ ప్రమాణాలతో కూడిన సమగ్ర విధానం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

బైక్ ట్యాక్సీలపై సేఫ్టీ ఆందోళనలు..
కర్ణాటక ప్రభుత్వం ప్రధానంగా ప్రయాణికుల భద్రతను ప్రశ్నిస్తోంది. ఆటోలు, క్యాబ్‌లతో పోలిస్తే మోటార్‌సైకిళ్లలో ప్రయాణికుల కోసం ప్రత్యేక భద్రతా సదుపాయాలు ఉండవని, ప్రమాదం జరిగినప్పుడు గాయాలు, మరణాల ముప్పు ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వం వాదించింది. ముఖ్యంగా ప్రమాదాల సమయంలో ప్రయాణికులకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఎలా వర్తిస్తుంది, మహిళా ప్రయాణికుల భద్రతను ఎలా నిర్ధారించాలి అనే అంశాలపై స్పష్టమైన నిబంధనలు ఉండాలని పేర్కొంది. రోడ్డు రద్దీ, కాలుష్యం, ప్రయాణికుల సేఫ్టీ, టూవీలర్ ప్రమాదాల్లో అధిక మరణాల రేటు వంటి అంశాలను కూడా ప్రభుత్వం తన పిటిషన్‌లో ప్రస్తావించింది.

హైకోర్టు ఏం చెప్పింది?
ఇంతకుముందు కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి.. బైక్ ట్యాక్సీలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను పరిశీలిస్తూ.. వాటిని అనుమతించే విధానం రూపొందించే వరకు సేవలను నిలిపివేయాలని ఆదేశించారు. దీనిపై ఓలా, ఉబర్, ర్యాపిడో, బైక్ యజమానులు, బైక్ ట్యాక్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అప్పీల్ చేశాయి. అనంతరం జనవరి 2026లో డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. మోటార్‌సైకిళ్లను ట్రాన్స్‌పోర్ట్ వాహనాలుగా నమోదు చేసి బైక్ ట్యాక్సీలుగా నడిపేందుకు అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించాలని సూచించింది. ట్యాక్సీ వ్యాపారం కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(g) కింద వృత్తి హక్కులో భాగమేనని హైకోర్టు అభిప్రాయపడింది.

బైక్ ట్యాక్సీలకు ప్రత్యేక చట్టం ఉందా?
కర్ణాటక ప్రభుత్వం మాత్రం మోటార్ వెహికిల్స్ యాక్ట్, 1988లో ఏదైనా వాహనాన్ని తప్పనిసరిగా ట్యాక్సీగా నడిపే హక్కు లేదని వాదిస్తోంది. కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిట్ ఇవ్వడం రవాణా అధికారుల విచక్షణకు లోబడి ఉంటుందని తెలిపింది. అంతేకాదు మోటార్‌సైకిళ్లను “మోటార్ క్యాబ్”, “కాంట్రాక్ట్ క్యారేజ్”గా పరిగణించడంపైనా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. కర్ణాటక ఆన్-డిమాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ అగ్రిగేటర్ రూల్స్, 2016 కూడా ప్రధానంగా నాలుగు చక్రాల క్యాబ్‌ల కోసం రూపొందించబడ్డాయని, అందులో మోటార్‌సైకిళ్లను ఉద్దేశపూర్వకంగా చేర్చలేదని పేర్కొంది.

ALSO READ : గోల్డ్, సిల్వర్‌పై టాక్స్ పెంపుతో మోడీ సర్కార్ 3 నెలల్లో ఎంత సంపాదించిందంటే..?

డ్రైవర్ల జీవనోపాధిపై నిషేధం కాదు..
బైక్ ట్యాక్సీలను అడ్డుకోవడం వల్ల డ్రైవర్లకు పూర్తిగా ఉపాధి అవకాశాలు మూసుకుపోవడం లేదని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల డెలివరీ, లాజిస్టిక్స్ సేవల్లో మోటార్‌సైకిళ్లను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. 2025లో అమల్లోకి వచ్చిన కర్ణాటక ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ, సంక్షేమ చట్టం ద్వారా వారికి ప్రయోజనాలు కూడా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.

అసలు పరీక్ష సుప్రీంకోర్టులోనే..
నగరాల్లో తక్కువ ఖర్చుతో, వేగంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తున్నాయని బైక్ ట్యాక్సీలకు అనుకూలంగా ఉన్నవారు  వాదిస్తున్నారు. ట్రాఫిక్‌లో కార్ల కంటే బైక్‌లు సులభంగా కదలగలగడం, ప్రయాణికులకు తక్కువ ధరలో సేవలు అందడం వీటి ప్రధాన ఆకర్షణ అంటున్నారు. అయితే సేఫ్టీ, ఇన్సూరెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవర్ల బాధ్యత, మహిళా ప్రయాణికుల రక్షణ వంటి అంశాలకు స్పష్టమైన నిబంధనలు లేకుండా బైక్ ట్యాక్సీలను అనుమతించాలా అన్నది కీలక ప్రశ్నగా మారింది. ఆగస్టు 11న ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉండటంతో సుప్రీంకోర్టు నిర్ణయం కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా బైక్ ట్యాక్సీ రంగం భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.