50 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా... మావోయిస్టుల అడ్డాగా మారిన కంచుకోట కర్రెగుట్టలో ప్రభుత్వ అధికారులు స్వేచ్ఛగా అడుగుపెట్టారని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఇవాళ పోలీసు అధికారుల ప్రత్యేక బృందంతో కలిసి డీజీపీ స్వయంగా కర్రెగుట్టను సందర్శించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను నిశితంగా పరిశీలించారు. యాభై ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా అన్ని శాఖల అధికారులు మావోయిస్టుల డెన్ లో ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తిరిగారు. గతంలో గ్రేహౌండ్స్, కోబ్రా బలగాలు కేవలం ఆపరేషన్లు నిర్వహించి వెంటనే వెనుదిరిగేవి అని..సెంట్రల్ కమిటీ మెంబర్లు ఈ ప్రాంతాన్నే తమ ప్రధాన ఆసరాగా చేసుకున్నారు. గతంలో ఈ ప్రాంతానికి పోలీసులు రావాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు.
►ALSO READ | రెండేళ్లలో కేసీఆర్ సీఎం.. పెద్ది కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం: మాజీమంత్రులు కేటీఆర్ , హరీశ్
కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా, తెలంగాణ పోలీసుల పకడ్బందీ వ్యూహంతో ఆరు నెలలపాటు కర్రెగుట్టలో ఆపరేషన్ విజయవంతంగా కొనసాగింది. ఫలితంగా మావోయిస్టులను ఆ ప్రాంతం నుంచి పూర్తిగా తరిమికొట్టాము.ఈ ఆపరేషన్ల ఫలితంగా ఏకంగా 700 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఒకరిద్దరు మినహా కీలక నేతలందరూ పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. గతంలో మృత్యుఘోష వినిపించిన కర్రెగుట్టలను... ఇకపై ఒక అద్భుతమైన టూరిజం ప్రాంతంగా మార్చడమే లక్ష్యం. దీని ద్వారా స్థానిక సామాన్య ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఆ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందుతుందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు.
